హిందూ సంస్కృతిలో పరమేశ్వరున్ని లింగ రూపంలో భక్తులు పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. హిమాలయాల్లో కైలాసం ఉందని అక్కడ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడని కొంతమంది ఋషులు చెప్పడం కూడా జరిగింది. అంతే కాదు హిమాలయ పర్వతాలలో ఉన్న పంచకేదార్ శివలింగ క్షేత్రాలు శివలింగ క్షేత్రాలలో ప్రశస్తమైనవి. ఈ పంచ కేదార్ క్షేత్రాలు కేదారేశ్వర్ నుండి బదరీనాధ్ వరకు విస్తరించి ఉన్నాయి.
హిమాలయాల హిల్ స్టేషన్స్ వల్ల అక్కడికి వాహనాలు వెళ్లే దారి ఉండదు. ఇక్కడి యాత్రా స్థలాలు కాలినడకనే వెళ్ళవలసి ఉంటుంది. సహజంగా కాలినడకన ఎక్కడికైనా వెళితే అలసిపోతాం. కానీ శారీరక అలసట తెలియకుండా ఉండేందుకు అన్నట్లు అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నడవలేని వారి కోసం గుఱ్ఱాలు , డోలీలు దొరుకుతాయి. చాలా చోట్ల చాలా ఎత్తు (స్టీప్) ఎక్కవలసి రావడంతో కాస్త ఆయాసం ఎక్కువగా అనిపిస్తుంది.