మన దేశంలో ఉన్న అతిపురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో ఎలుకలను దేవత స్వరూపంగా భావించి భక్తులు ఆ ఎలుకలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో ఇరవై వేల ఎలుకలు అనేవి ఉన్నవి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందడం వెనుక పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్ రాష్ట్రం, బికనీర్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో దెష్ణోక్ గ్రామంలో కర్ణిమాత ఆలయం ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం పది గ్రామాల మూలాల నుండి ఏర్పడగా అప్పట్లో ఈ ప్రాంతాన్ని దస్ నోక్ అని పిలిచేవారు. ఈ ఆలయంలో దర్శనమిచ్చే కర్ణిమాత దుర్గామాత అవతారంగా చెబుతారు. ఇక ఈ ఆలయంలో 20 వేల ఎలుకలు ఉండగా, ఇవి కాబాస్ అనే పేరుతో పూజించబడుతున్నాయి. అందుకే ఈ ఆలయాన్ని ఎలుకల దేవాలయం అని పిలుస్తారు.
ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆ ఎలుకల మధ్యనే జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ ఎలుకలను అమ్మవారి పిల్లల ఆత్మలుగా భక్తులు భావిస్తారు. వీటికి భక్తులు నైవేద్యం సమర్పిస్తారు. ఆలయంలో ఉన్న ఎలుకలు భక్తుల పైన పాకితే మంచి జరుగుతుందని భావిస్తారు. అంతేకాకుండా తెల్ల ఎలుకలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి, ఒకవేళ తెల్ల ఎలుక ఎవరికైనా కనిపిస్తే అది చాలా అదృష్టంగా భావిస్తారు. కానీ ఈ తెల్ల ఎలుకలు అనేవి కేవలం శుభదినాలలో కనిపించడం విశేషం.
ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం కర్ణిమాత అనే దుర్గాదేవి భక్తురాలు ఉండేది. ఈమె దాదాపుగా 150 సంవత్సరాలు జీవించింది. అయితే అతేంద్రియ శక్తులు ఉండటంతో ఆమె గ్రామంలో ఉన్న వారి సమస్యలని నెరవేర్చెదని నమ్మకం ఉండేది. ఇలా ఉంటె ఒక రోజు ఆమె తన ఇంట్లోనే ఆకస్మికంగా కనిపించకుండా మాయం అవ్వడంతో అక్కడి ప్రజలు ఆమె ఆలయాన్ని నిర్మించారు. ఇలా కొన్ని రోజుల తరువాత అమ్మవారు భక్తులతో మాట్లాడుతూ త్వరలోనే నా వంశంలోని వారు చనిపోతారని, వారు ఎలుకలుగా జన్మిస్తారని చెప్పినదని పురాణం.
ఈ ఆలయంలో నాలుగే తెల్ల ఎలుకలు అనేవి ఉండగా, అవి కర్ణిమాత బిడ్డలుగా చెబుతారు. అందుకే ఈ తెల్ల ఎలుకలు ఎవరికైనా కనిపిస్తే వారికీ ఆ అమ్మవారి పూర్తి ఆశీస్సులు ఉంటాయని భక్తుల నమ్మకం. ఇది ఇలా ఉంటె, ఈ ఆలయంలో భక్తులు కారణంగా ఒకవేళ ఎలుక చనిపోతే, ఆ చనిపోయిన ఎలుక బరువు అంత వెండి ఎలుకను తయారుచేసి ఆలయంలో పెట్టి దోషాన్ని పోగొట్టుకుంటారు. పూర్వం జోధ్పూర్, బికనీర్ రాజా వంశానికి చెందినవారు ఈ అమ్మవారిని కులదైవంగా భావించేవారు. గంగాసింగ్ అనే రాజు ఈ ఆలయాన్ని 15 వ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలియుచున్నది.
ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి నవరాత్రి సమయాలలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించి ఎలుకలకు నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు.