ఈ సృష్టిలో ధర్మాన్ని కాపాడటం కోసం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు. జీవరాసి సముద్రంలో ఆవిర్భవించింది అనడానికి సంకేతంగా మత్స్య , కూర్మావతారాలు, ఆ జీవరాసులు పశుపక్ష్యాదులుగా పరిణతి చెందాయనడానికి గుర్తుగా వరాహావతారం ధరించాడు. ఇంకా మృగ రూపం నుంచి మానవ రూపం ఏర్పడుతుందనడానికి సంకేతంగా నృసింహ అవతారం అంతేకాకుండా మానవుడి తొలి దశను గుర్తుచేసే మరుగుజ్జు రూపంలో వామన అవతారాన్ని ధరించి లోక కల్యాణానికి కారకుడయ్యాడు. ఇది ఇలా ఉంటె భగవంతుడు కల్కి అవతారం యొక్క విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దశావతారాలలో పదవ అవతారమే ఈ కల్కి అవతారం. కలియుగ అంతములో శ్రీ మహా విష్ణువు కల్కిగా అవతరిస్తాడని పురాణాలూ చెబుతున్నాయి. అయితే శంభల అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో ఈయన జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు. కల్కి అనగా తెల్లని గుర్రము అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం. ఇంకా బౌద్ధ కాలచక్ర గాధా సంప్రదాయంలో శంభల రాజ్యాన్ని పాలించారనబడే 25 మంది పురాణ పురుషులకు కల్కి, కులిక, కల్కిరాజు వంటి సంబోధనలున్నాయి.
భాగవత పురాణంలో ముందుగా 22 అవతారాలు చెప్పబడ్డాయి. తరువాత మరొక మూడు అవతారాలు చెప్పబడ్డాయి. ఈవిధంగా మొత్తం 25 అవతారాలు ఉన్నాయి. వీటిలో 22వ అవతారంగా కల్కి అవతారం పేర్కొనబడింది. సాధారణంగా కల్కి అవతారం ధూమకేతువు వంటి ఖడ్గం చేబట్టి దూకు గుర్రమునెక్కి దుష్టులని వధించు మూర్తిగా వర్ణిస్తారు.
విష్ణు పురాణం ప్రకారం, వేదోక్త ధర్మ విధులు క్షీణించినపుడు కలికాలాంతం సమీపిస్తుంది. అపుడు విష్ణువు కల్కిగా శంభల గ్రామంలో విష్ణుయశుని ఇంట అవతరిస్తాడు. అలా అవతరించి తన పరాక్రమంతో మ్లేచ్ఛులను, చోరులను నాశనం చేసి దర్మాన్ని పునరుద్ధరిస్తాడు. అప్పుడు జనులు సన్మార్గాన్ని అనుసరించడం మొదలు పెట్టి సంతానం కృతయుగ ధర్మాన్ని ఆచరిస్తారు. అయితే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ఉన్నపుడు కృతయుగం ఆరంభమవుతుంది.
ఇలా భగవంతుడు ధరించిన ప్రతి అవతారం వెనుక ఓ అర్థం పరమార్థం దాగి వున్నాయి. అందుకే కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందనీ, ఆ సమయంలో తాను కల్కి గా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహా విష్ణువు చెప్పినట్టుగా పురాణాలలో కనిపిస్తుంది.