శబరిమలలో వెలసిన అయ్యప్ప స్వామి, తన జన్మ రహస్యం తెలుసుకొని అతని తండ్రికి తాను వేసిన బాణం ఎక్కడ అయితే చేరుకుంటుందో అక్కడ ఆలయాన్ని నిర్మించమని చెబుతాడు. అయితే శబరిమలలో మనకి వావర్ మసీదు కనిపిస్తుంది. మరి ముస్లిం అయినా వావర్ కి స్వయానా అయ్యప్ప స్వామియే శబరిమలలో అతనికి మసీదు కట్టమని ఎందుకు చెప్తాడు? అసలు వావర్ అంటే ఎవరు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వావర్ యుద్ధవిద్యలో ఆరితేరినవాడు. ఒకప్పుడు అతడు అయ్యప్పతో మూడురోజుల పాటు యుద్ధం చేశాడు. అయితే ఇద్దరూ యుద్ధంలో సమానమైన ప్రతిభను ప్రదర్శించారు. అయ్యప్ప ఆయుధాన్ని పడవేసి వావర్ ను కౌగలించుకొని స్నేహం పొందాడు. తర్వాత కాలంలో వావర్ అయ్యప్పకు ప్రముఖ శిష్యుడైనట్లు పేర్కొనబడింది. అయ్యప్ప పండలం రాజును వావర్ కు ఒకమసీదు కట్టించమని సూచించినట్లు చెబుతారు.
శబరిమలలో ప్రధాన ఆలయం సమీపంలో వావర్ పేరుతో మసీదు నిర్మాణమయింది. ఇస్లాం మత ఆచారం ప్రకారం ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ కాలేదు. వావర్ ఉనికిని చూపుతూ కేవలం వంపుతిరిగిన ఒక శిల మాత్రం ఉన్నది. నాలుగు గోడలలో మూడు గోడలకు ఆకుపచ్చ వస్త్రం చుట్టబడింది. ఒక గోడ వస్త్రంలేకుండా ఉన్నది. ఆగోడ వద్ద ఒక పురాతన కత్తి ఉంచబడింది. వావర్ కు ఇక్కడ మిరియాలు సమర్పిస్తారు. నేటికీ ఇక్కడ ఒక మతప్రవక్త ఇస్లాం ఆచారాల ప్రకారం ప్రార్థన కార్యక్రమాలు నిర్వహిస్తాడు. యాత్రాసమయంలో ఈ మసీదులో వేలాది మంది హిందువులు ప్రార్థనలు జరుపుతుంటారు. వావరస్వామికి ప్రార్థనలు జరిపిన తర్వాత మాత్రమే అయ్యప్పకు పూజలు జరుగుతాయి.
ఎరుమెలిలో ముస్లింలు విభూతి, గంధం ధరించి హిందూమత సోదరులకు అభినందనలు వ్యక్తం చేయడం ఇక్కడి ఆచారం. వావర్ మసీదు ప్రపంచస్థాయిలో మతసామరస్యానికి చిహ్నమని పేర్కొంటారు.
కోట్టయం జిల్లాలో ఎరుమెలి వద్ద ఈ మసీదు నెలకొని ఉన్నది. ఎరుమెలిలో అయ్యప్ప మహిషి అనే రాక్షసిని సంహరించాడు. మకరదీపం సందర్భంగా అయ్యప్ప భక్తులు ఇక్కడ సామూహికంగా ఆధ్యాత్మిక నృత్యం చేస్తూ ఆనందిస్తారు.
అయ్యప్ప దర్శనానికి వెళ్ళే భక్తులు ఇరుముడిలో వివిధ సామగ్రులను తీసుకొనివెడతారు. వాటిలో అగరబత్తీలు కూడా ఉంటాయి. అవి మసీదులో కైంకర్యం చేయడానికి ఉద్దేశింపబడినవి. భక్తులు శబరమలకు వెడుతూ ఎరుమెలి మసీదులో పూజలు జరిపి అక్కడి బాబా ఆశీస్సులు పొంది ముందుకు వెడతారు.
ఈవిధంగా తనతోపాటు యుద్ధంలో సరిపాటి అయినా తన శిష్యుడిగా చెప్పే వావర్ కి ఒక మసీదు ఉండాలని అయ్యప్ప స్వామివారు అయన తండ్రికి ఆఙ్ఞాపించారని స్థల పురాణం చెబుతుంది.