మన హిందూసాంప్రదాయంలో ఎంతో మంది దేవతలు, ఎన్నో దేవాలయాలు అనేవి ఉన్నాయి. కానీ ఈ గ్రామంలో విచిత్రం ఏంటంటే వారు గబ్బిలాలను దేవతలుగా భావిస్తూ, ఇక ఆ గబ్బిలాలు నివసించే చెట్టే ఆలయంగా భావిస్తూ రోజు పూజలు కూడా చేస్తున్నారు. మరి విచిత్రంగా వీరు గబ్బిలాలను దేవతలుగా ఎందుకు భావిస్తున్నారు, దాని వెనుక కారణం ఏంటి? ఇంకా ఈ గ్రామంలో ఉన్న ఆచారాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, రైల్వేకోడూరు మండలం మాధవరంపోడు గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఉండే ఒక చెట్టు పైన వందల కొద్దీ గబ్బిలాలు నివసిస్తుంటాయి. ఇలా గబ్బిలాలు వాలిన చెట్లకి ఈ గ్రామస్థులు పూజలు చేస్తుంటారు. ఇలా వీరు మాత్రమే కాకుండా చుట్టూ పక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తుంటారు.
అయితే ఇక్కడి గ్రామస్థుల నమ్మకం ఏంటంటే, పక్షి దోషం తో ఉన్న లేదా అనారోగ్యం తో ఉన్న చిన్న పిల్లలకి గబ్బిలాలు ఉన్న చెట్టు దగ్గరికి తీసుకువచ్చి పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా గబ్బిలాల ఎముకలను పిల్లలకి తాయత్తులుగా కడుతుంటారు. ఇలా చేయడం వలన పక్షి దోషం పోతుంది అని, రోగాలు అన్ని నయం అవుతాయని ఇక్కడి గ్రామస్థుల నమ్మకం.
ఈ గ్రామస్థులు గబ్బిలాలను పూజించడం వెనుక ఒక కారణం ఉందని చెబుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంత కూడా కక్షలతో, కరువులో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉండేదని ఒకరోజు కొన్ని వందల సంఖ్యలో గబ్బిలాలు ఈ ఉరి చివర ఉన్న మర్రి చెట్టు పైన వాలి కొన్ని రోజులకి ఊరిలో ఉండే కొన్న చెట్లపైన వాలాగా కొన్ని రోజుల్లోనే ఆ ఊరిలో ముఠాకక్షలు తగ్గిపోయి ఊరు అభివృద్ధి చెందింది అని, గబ్బిలాలు వచ్చాకే ఊరు బాగుపడింది అని, ఆ దేవుడే వీటిని పంపించాడని ఈ గ్రామస్థుల నమ్మకం. ఇక అప్పటినుండి వీరు ఇలా పూజలు చేయడం ప్రారంభించారు.
అయితే వందల సంఖ్యలో గబ్బిలాలు ఉండగా ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి హాని వాటి వల్ల జరగలేదని స్థానికులు చెబుతున్నారు.