మన దేశంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన మహిమగల ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాలలో చాలా అరుదైన అద్భుత క్షేత్రం ఇది అని చెప్పవచ్చు. మరి కొలను భారతి అంటే ఎవరు? ఈ ఆలయ రహస్యం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆత్మకూరు నుండి 18 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ కొలను భారతి ఆలయం ఉంది. దేశంలో ఉన్న అతి పురాతన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. నల్లమల అడవుల్లో ఎత్తైన కొండల నడుమ చారుగోషి నది ఒడ్డున ఈ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 11 శతాబ్దంలో మల్లభూపతి అనే చాళుక్య రాజు నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ వెలసిన భారతీదేవి సరస్వతీదేవి యొక్క మరొక రూపంగా భావిస్తారు.
సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి. సరస్వతి దేవి కొలువై ఉన్న ఆలయాలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే సరస్వతీదేవి కొలువై ఉన్న అరుదైన ఆలయాల్లో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఈవిధంగా భారతీదేవి సరస్వతీదేవి గా కొలువుదీరిన ఈ ఆలయంలో భక్తులు తమ పిల్లలకు అక్షరాబ్యాసాన్ని ఈ ఆలయంలో చేస్తారు. ఈ చదువుల తల్లి కొలువైన ఈ ఆలయంలో అక్షరాలు దిద్దిన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, అమ్మవారి దీవెన వారిపైన ఎప్పుడు ఉంటుందని భక్తుల ప్రగాడ నమ్మకం.
ఇక అడవిలో వెలసిన ఈ సరస్వతీదేవి ఆలయానికి అక్షరాబ్యాస సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి రోజు ప్రత్యేక పూజలతో పాటు ముఖ్యమైన రోజుల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.