హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు. మరి వినాయకుడు కొలువైన ఉన్న కొన్ని అద్భుత ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సిద్ది వినాయక ఆలయం:
మహారాష్ట్రలో సిద్ది వినాయక ఆలయం ఉంది. శ్రీ మహావిష్ణువు రాక్షసులతో యుద్ధం చేస్తూ వినాయకుడి సహాయాన్ని కోరగా వినాయకుడి పాదస్పర్శతో కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ద క్షేత్రం అయింది. ఇక ఆ సంతోషంలో శ్రీమహావిష్ణువే వినాయకుడికి ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం. ఇక్కడ విశేషం ఏంటి అంటే మిగతా క్షేత్రాల్లోని విగ్రహాలకు బిన్నంగా ఇక్కడ సామీ వారి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది. ఇంకా అత్యధిక ఆదాయం వచ్చే ఆలయాల్లో సిద్ధివినాయక మందిరం ఒకటి.
కాణిపాకం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, ఐరాల మండలానికి దగ్గరలో కాణిపాకం ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరు ఏదైనా తప్పు చేసిన, వివాదం వచ్చిన వారితో స్వామి యెదుట ప్రమాణం చేపిస్తారు. ఒకవేళ అబ్బడం చెప్పితే కొద్దీ రోజుల్లోనే శిక్షింపబడతారని, అందువల్లే ఎవరు అబద్దం చెప్పడం కానీ, స్వామి యెదుట చేసిన ప్రమాణం తప్పడం కానీ ఉండదని భక్తుల నమ్మకం.
నరముఖ గణపతి:
తమిళనాడు రాష్ట్రంలో, తిలతర్పణపురి అనే గ్రామంలో స్వర్నవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం ఉన్నది.ఇక్కడ వెలసిన వినాయకుడు తొండం లేకుండా మానవ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈవిధంగా వెలసిన గణపతిని నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి అని చాలా ప్రసిద్ధి చెందినది. ఈవిధంగా వినాయకుడు మానవ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదేనని చెప్పవచ్చు.
కమండల గణపతి :
కర్ణాటక రాష్ట్రం, చిక్కమగళూరు జిల్లా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కమండల గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు.ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, శని వక్రదృష్టి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొన్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలనీ భావించి శివుడి కంటే ముందుగా గణపతిని ప్రార్దించినదట, అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు ఒక తిర్దాన్ని సృష్టించాడని పురాణం. ఇలా వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి కనిపించిన వినాయకుడు సృష్టించిన తిర్దాన్ని బ్రహ్మ తీర్థం అని, కమండలం ధరించి దర్శనమిచ్చిన గణపతిని కమండల గణపతి అనే పేరు వచ్చినది స్థల పురాణం. ఇక్కడే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు.
స్వయంభువు సర్వసిద్ది వినాయకుడు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా కేంద్రం నుండి 30 కి.మీ. దూరంలో చోడవరం అనే గ్రామం కలదు. ఈ గ్రామంలోనే స్వయంభువు సర్వసిద్ది వినాయకుడి ఆలయం ఉంది. అయితే చిత్తూరు జిల్లాలోని కాణిపాకం తరువాత అంతటి పేరున్న సర్వసిద్ది వినాయకుడు ఈ చోడవరంలో స్వయంభువుగా వెలిసాడు. వినాయకుడు స్వయంభువుగా వెలసిన ఆలయాలలో ఒకటి కాణిపాకం అవ్వగా రెండవది ఈ ఆలయమే అని చెబుతారు.
బనేశ్వర దేవాలయం:
రాజాస్థానం రాష్ట్రంలోని దక్షిణభాగంలో దుంగర్భుర్జైళ్లకు పరిపాలన కేంద్రంగా దుంగర్భుర్ ఉంది. ఈ ఆలయం హిందూ, జైన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతంలోనే బనేశ్వర దేవాలయం ఉంది. ఈ ఆలయంలో తాంత్రిక వినాయకుడు ఉన్నాడు.
మహా గణపతి ఆలయం:
కేరళ రాష్ట్రంలోని కాలికట్ కు దగ్గరలో కాసారగాడ్ అనే ఊరిలో మహా గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మధురాలయం అని అంటారు. ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభూగా వెలిశాడని ప్రసిద్ధి. ఈ ఆలయంలో కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇలా ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన ఈ ఆలయంలోని వినాయకుడు రోజు రోజుకి ఎత్తు పెరగడం భక్తులని ఆశ్చర్యానికి గురి చేస్తూ విశేషంగా ఆకట్టుకుంటుంది.
రాక్ ఫోర్ట్ దేవాలయం:
తమిళనాడు రాష్ట్రము, తిరుచిరాపల్లి జిల్లా, టెప్పాకులం అనే ప్రాంతంలో రాక్ ఫోర్ట్ దేవాలయం ఉంది. ఈ ఆలయంలోనే వినాయకుడు కొండపైన స్వయంభుగా వెలిసాడు. తిరుచిరాపల్లినే ట్రిచీ అని అంటారు. అయితే రాక్ ఫోర్ట్ క్రింది భాగమున బ్రహ్మాండమైన కోనేరును నిర్మించారు దీన్ని తెప్పకుళం అంటారు. ఈ రాక్ ఫోర్ట్ కొండ భూమట్టం నుండి సుమారు 272 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కొండకి దక్షిణ దిక్కున రాతిమెట్లు కట్టబడ్డాయి. ఇచట ఒక రాతి లింగం ఉంది భక్తులు దీనిని మలైకొళుందిశ్వరర్ అని పిలుస్తారు. ఒకే ఒక పెద్ద శిల నుండి పల్లవ శిల్పులు ఈ దేవాలయాన్ని అధ్బుతంగా మలిచారు.
శ్వేత గణపతి:
తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఈ శ్వేత గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్వేతార్కమూల గణపతిగా భక్తులచే పూజలందుకొంటున్నాడు. ఈ ఆలయంలో తెల్లజిల్లేడు మొక్క మూలం నుంచి వెలిశాడు కాబట్టి ఇక్కడి గణపతిని శ్వేతార్కమూల గణపతిగా పిలుస్తుంటారు. వందేళ్లపైబడిన ఈ ఆలయంలోని మూర్తిని ఏ శిల్పీచెక్కలేదు తెల్లజిల్లేడు మొదలు భాగంపై గణనాథుడే స్వయంగా వెలిశాడని చెబుతారు. ఇక్కడ చెట్టు బెరడుపైని గణపతి మూర్తికి అన్ని అవయవాలు ప్రస్ఫుటంగా కనిపించడం విశేషం.
అష్టగణపతి ఆలయాలు:
మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ అష్టగణపతి ఆలయాలకు ఎంతో విశిష్టత అనేది ఉంది. ఈ అష్ట గణపతి క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవాలని నియమం కూడా ఉంది. బల్లాలేశ్వర గణపతి, వరద వినాయకుడు, చింతామణి గణపతి, మయూరేశ్వర గణపతి, సిద్ది వినాయకుడు, మహాగణపతి, విఘ్న వినాయకుడు, గిరిజాత్మజ వినాయకుడు. ఈవిధంగా మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ అష్టగణపతి క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకుంటే ముక్తిదాయకం అని చెబుతారు.
సాక్షి గణపతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా లో కృష్ణానది తీరంలో ఉన్న దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు, సముద్రమట్టానికి దాదాపుగా 458 మీ. ఎత్తున్న కొండపైన వెలసిన అతి పురాతన శైవక్షేత్రం శ్రీశైలం. శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి సాక్షి గణపతి అనే ఆలయం ఉంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే గణపతి విగ్రహం ఏదో వ్రాస్తున్న భంగిమలో కూర్చొని ఉన్న విధంగా భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. ఇక సాక్షి గణపతి ప్రత్యేకత ఏంటంటే, శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించిన భక్తులను స్వామి తన చిట్టాలో వ్రాసుకొని కైలాసంలో ఉన్న పరమశివుడికి నివేదించి సాక్షముగా ఉంటాడని ప్రతీతి. అంటే శ్రీశైలానికి వచ్చి శివుడిని దర్శనం చేసుకున్న భక్తులకి కైలాసా ప్రవేశానికి అనుమతి లభిస్తుందని అప్పుడు శ్రీశైలానికి వచ్చిన భక్తులకి గణపతి సాక్షిగా ఉంటాడని చెబుతారు. ఇలా భక్తులు శ్రీశైలానికి వచ్చారని గణపతి సాక్ష్యంగా ఉంటాడు కనుక ఈ స్వామికి సాక్షి గణపతి అనే పేరు వచ్చినదని అంటారు.
ఖైరతాబాద్ వినాయకుడు:
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని ఖైరతాబాద్ అనే ప్రాంతంలో వినాయకుడి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయకచవితి ని చాలా వైభవంగా జరుపుతారు. అయితే మొట్టమొదటగా 1954 వ సంవత్సరంలో ఖైరతాబాద్ లో ఒక్క అడుగు వినాయకుడి విగ్రహం తో వినాయక చవితి వేడుకలు అనే జరిపారు. ఈవిధంగా ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి కి ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ వచ్చారు. అయితే ఒక్క అడుగుతో ప్రారంభించిన ఖైరతాబాద్ వినాయకుడు ఆలా ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు. ఇలా 60 సంవత్సరాల పాటు 60 అడుగులు పెరిగిన తరువాత మళ్ళి ఒక్కో అడుగు తగ్గిస్తూ మళ్ళీ తరువాతి 60 సంవత్సరాలకి ఒక్క అడుగు వినాయకుడిని ప్రతిష్టించాలని ఈ ఆలయ కమిటీ నిర్ణయించారట.