తిరుమల తిరుపతి లో శ్రీ వేంకటేశ్వరస్వామి కలియుగ దైవంగా భక్తులకి దర్శనం ఇస్తుండగా, ఈ ఆలయంలో విశేషం ఏంటంటే వేంకటేశ్వరస్వామి ఒకే విగ్రహం దశావతారలతో భక్తులకి దర్శనం ఇస్తుంది. అందుకే ఈ స్వామి దశావతార వేంకటేశ్వరస్వామి గా ప్రసిద్ధి చెందాడు. ప్రపంచంలో ఇలాంటి విగ్రహం అనేది మరెక్కడా కూడా లేకపోవడం విశేషం. మరి ఈ ఆలయం గురించి మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, నంబూరు సమీపంలో దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. తిరుమల తిరుపతి లో వేంకటేశ్వరస్వామి ఏకరూపంలో దర్శనమిస్తే ఈ ఆలయంలో ఒకే విగ్రహంలో స్వామివారు దశావతారాలలో దర్శనం ఇస్తున్నారు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం 11 అడుగులు ఉండగా పీఠంతో కలిపి మొత్తం 12 అడుగులు ఉంటుంది.
ఈ ఆలయం మొత్తం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడా ఆగమశాస్త్ర ప్రకారం జరిగింది. గురూజీ శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో ఈ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం అనేది జరిగింది. విజయవాడకి చెందిన లింగమనేని కుటుంబ సభ్యులు ఈ ఆలయ నిర్మించాలని భావించి గణపతి సచ్చిదానంద స్వామివారిని సంప్రదించి ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. లింగమనేని రమేష్ గారికి 2000 వ సంవత్సరంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నప్పుడు అయన మదిలో ఈ ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన రాగ, 2006 లో కార్యరూపానికి రాగ, దశావతార విగ్రహ నిర్మాణానికి ఆరు సంవత్సరాలు పట్టగా వారు అనుకున్న 18 సంవత్సరాల కల 2018 లో దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయం పూర్తయింది.
శ్రీ మహావిష్ణువు లోకకల్యాణం కోసం దశావతారాలను ఎత్తాడు. అయితే దశావతార రూపంలో ఉండే ఈ 11 అడుగుల అద్భుత విగ్రహం కాళ్ళ నుండి నడుము వరకు వరాహ, మత్స్య, కూర్మ అవతారలలో ఉండగా మిగిలిన ఏడు అవతారాలు కూడా స్వామివారి విగ్రహంలో చాలా అందంగా భక్తులకి దర్శనమిస్తాయి. ఇలా వేంకటేశ్వరస్వామి విగ్రహం దశావతారాలలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం, మొట్టమొదటి ఆలయం ఇదే అవడం విశేషం. ఈ ఆలయంలో స్వామివారి ఆలయమే కాకుండా మరొక నాలుగు ఉపాలయాలు కూడా ఉన్నవి. అందులో మహాలక్ష్మి, మహాగణపతి, గరుడ అళ్వార్, విష్వక్షేన విగ్రహాలను ప్రతిష్టించారు.
ఇక దశావతార వెనకటేశ్వరస్వామి విగ్రహ విషయానికి వస్తే, రమణ అనే శిల్పి మొదట వేంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ముందుగా ఒక బొమ్మని గీసుకున్నారు. శిల్పి సుబ్రహ్మణ్య ఆచార్యుల వారు రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక తమిళనాడుకి చెందిన కె. ఎస్. కనకరత్నం గారు భూసమేత వేంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి, గణపతి, విశ్వక్సేనుడు వంటి విగ్రహాలను చాలా అద్భుతంగా మలిచారు. ఇంకా ఈ ఆలయంలో 60 అడుగుల 9 అంగుళాల ఎత్తైన ధ్వజ స్తంభాన్ని నిర్మించారు.
తిరుమల తిరుపతి దర్శనమిచ్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారు దశావతారాలలో దర్శనమిచ్చే ఈ అద్భుత ఆలయాన్ని దర్శించడం భక్తులు అదృష్టంగా భావిస్తున్నారు.