మన హిందూ జ్యోతీష్య శాస్త్రం ప్రకారం ‘శనీశ్వరుడు’ , నవగ్రహాలలో ఒక గ్రహం. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం కూడా ఇందుకు మినహాయింపు కాదు. గ్రహరూపలో పూజింపబడే ‘శని’ ఒక గ్రహదేవుడు. మరి అలాంటి శని దేవుడు ఎలా జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం.
త్వష్ట ప్రజాపతి తన కూతురైనా సంజ్ఞాదేవిని సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే సూర్యుని కిరణాల వేడిని భరించలేక సంజ్ఞాదేవి తన ఛాయ అనగా నీడకు ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తన తండ్రివద్దకు వెళ్ళిపోతుంది. ఈ ఛాయాదేవి, సూర్యు భగవానుల కుమారుడే శనీశ్వరుడు. ఈయన విభవ నామ సంవత్సరం, మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథియందు ధనిష్టా నక్షత్రంలో జన్మించాడు. శనికి శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూరలోచనుడు, పంగు పాదుడు, గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి. ఇతనికి మందగమనుడు అనే పేరు కూడా ఉంది. అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది.
శనీశ్వరుడు విష్ణుమూర్తికి తోడల్లుడు, సూర్యుని కుమారుడు, యమధర్మ రాజుకి, యమునా నదికి అగ్రజుడు. గ్రహాలకు యువరాజు వంటివాడు. హనుమాన్ కి స్నేహితుడు కాలభైరవుడికి భక్తుడిగా చెబుతారు. ఈయన కుడిచేతిలో దండం, ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి. నల్లని కాకి అతని వాహనం. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ‘ఏడు’ శనికి ప్రీతికరమయిన సంఖ్య.
నల్ల వస్త్రం. నూనెదీపం, అగరవత్తులు, నువ్వులనూనె, స్వీట్లు, పండ్లు, దండ, జిల్లేడు ఆకులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, గుర్రపు నాడా, చిన్న దిష్టిబొమ్మ శనికి ప్రీతికరమైన వస్తువులు. ఇవి సమర్పించలేనివారు పావు లేదా అరలీటరు నూనెతో తైలాభిషేకం శని కృపకు పాత్రులు కావొచ్చు. సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే దేవుడు శనిభగవానుడు. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు. గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు.
ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి, అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్పుడు, పురూరవుడు, సాగరుడు, కార్త్య వీర్యార్జునుడు వంటి వారంతా శని మహిమ వల్ల అనేక కష్టనష్టాలను అనుభవించి చివరకు శని కృపాదృష్టితో ఆనందాన్ని పొందిన వారే.