తన సృష్టి లోని జీవులకు బాధలు పెరిగినపుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం కోసం శ్రీమహా విష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. ఇలా అవతరించడాన్ని లీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు, భాగవతం ప్రకారం, భగవంతునికి ఇరువై రెండు (22) ఉన్నాయి. ఈ లీలావతారాలు ఇరవైరెండింటి లోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి. ఈ పదింటిని దశావతారాలు అంటారు.
శ్రీమహావిష్ణువు లీలావతారాలలో ఇరువదవ అవతారం శ్రీకృష్ణావతారం. లోక కళ్యాణం కోసం త్రేతాయుగంలో శ్రీరాముడిగా జన్మించిన నారాయణుడు ఆ తర్వాతదయిన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా భావిస్తారు.
హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దొచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి.
అయితే శ్రీకృష్ణుని వివాహల విషయంలో, సంతానం విషయంలో చాలా మందికి రకరకాల అపోహలు ఉన్నాయి. మాధవుని గురించి జగమెరుగని సత్యాలను ఇప్పుడు తెలుసుకుందాం… శ్రీకృష్ణుడికి 16వేల మంది భార్యలు ఉండేవారని అందరికీ తెలిసిందే. నరకాసురుని చెరలో ఉన్న 16వేల మంది యువ రాణులను విడిపించి వారికి సంఘములో సముచిత స్థానము కల్పించాడు. అప్పుడు వారు కృష్ణున్ని భర్తగా ఉండమని వేడుకుంటే.. అందుకు కృష్ణుడు అంగీకరించి వారిని పెళ్లి చేసుకుంటాడు. “భర్త అనగా భరించువాడు” అను నానుడి ప్రకారము, ఒక పురుషుని పంచన చేరి, అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమానస్థితిగతులనుబట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు. దీంతో కృష్ణుడికి 16వేల మంది భార్యలు ఏర్పడతారు.
అయితే కృష్ణుడికి నిజానికి అంతకు ముందే 8 మంది భార్యలు ఉన్నారు. వారిని కృష్ణుడి అష్ట భార్యలు అని శ్రీకృష్ణుడు అష్టభార్యలను వివాహమాడాడు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, భధ్ర, నాగ్నజితి, మిత్రవింద మరియు లక్షణ. వీరినే అష్టమహిషులుగా కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. మాధవుని చెంత చేరిన 16వేలమంది గోపికలు సైతం ఒక్కొక్కరు పది మంది సంతానాన్ని పొందినట్టు పురాణాలూ చెబుతున్నాయి. అయితే ఆయనను ప్రేమించిన భార్యలకు, గోపికలకు సంతానం కలిగింది ఆయనకున్న యోగశక్తి వల్ల మాత్రమే శృంగారం వలన కాదు. చాలామంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి 16వేలమంది భార్యలతో శారీరక బంధము లేదు. కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. శ్రీ కృష్ణతత్వం బ్రహ్మజ్ఞానం పొందినవారికి తప్ప సామాన్యులకు అర్దంకానిది. ఆయనే నారాయణుడు, ఆయనే సదాశివుడు, ఆయనే సర్వాంతర్యామి.