చలికాలంలో తరచుగా జలుబు చేస్తుంటుంది. యూకలిప్టస్ ఆయిల్ అని పిలువబడే నీలగిరి తైలాన్ని జలుబుకు విరుగుడుగా వినియోగించుకోవచ్చు. నీలగిరి తైలం జలుబుకు దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయిల్ అనేక లాభాలను ఇస్తుంది. దీన్ని ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని అందులో కొద్దిగా నీలగిరి తైలం వేసి ఆవిరి బాగా పీల్చాలి. ఇలా రోజుకు 2, 3 సార్లు చేస్తే ఎంతటి జలుబైనా త్వరగా తగ్గుతుంది. అలాగే దగ్గు, ముక్కు దిబ్బడ, ఫ్లూ జ్వరం తదితర ఇతర శ్వాస కోశ సమస్యలు కూడా నయమవుతాయి.
కొద్దిగా గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా నీలగిరి తైలం వేసి బాగా కలిపి దాంతో నోరు పుక్కిలించాలి. ఇలా రోజూ చేయడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. అంతేకాదు దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది.
శరీరంలో నొప్పులు ఉన్న ప్రదేశంలో నీలగిరి తైలం రాసి ఆయా భాగాల్లో వేడి నీటి కాపడం పెట్టాలి. దీంతో నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల కీళ్లు, కండరాల నొప్పులు త్వరగా తగ్గుతాయి.