అరటి ప్రాముఖ్యతను, పూజా విధానాన్ని గురించి రామాయణంలో భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు ఉంది. మాఘ చతుర్థశి ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి, పెరటిలోఉన్న అరటిని చెట్టు గానీ, లేదా అరటి పిలకనుగానీ పూజ చేయవచ్చు.
పసుపుకుంకుమలతో, పుష్పాలతో చక్కగా అరటికాండాన్ని అలంకరించి, దీపారాధన చేయాలి. దూపానంతరం పెసరపప్పు బెల్లం, 14 తులసీ దళాలు (నాలుగు ఆకులు ఉండాలి) నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్న సమయంలో ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి, వారికి అరటిదవ్వ, ఐదు అరటి పండ్లను దానమివ్వాలి. ఈ పూజను చేసినవారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం చంద్రదర్శనం అయిన పిమ్మట భోజనం చేయాలి.
ఈ అరటి పూజ చేసిన వారికి చక్కని సంతానం కలుగుతుంది. ఆ సంతానానికి ఉన్నత స్థితి కలుగుతుంది. రామాయణంలో అరటిపూజను సీతారాములు చేసినట్లు తెలుస్తుంది. రావణాసురుని వధానంతరం శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరి అక్కడ విడిది చేశారు. తరువాత శ్రీరాముడు భరతునికి తన రాకను గురించి తెలియచేయమని మారుతిని పంపాడు. హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి, తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు.
ఆ సమయంలో శ్రీరామునితో సహా అందరూ మధ్యాహ్న భోజనం అరటి ఆకులలో తినడానికి ఉపక్రమిస్తున్నారు. మారుతికి అరటిఆకు కరువైంది. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని గొప్పతనాన్ని అక్కడివారికి తెలియ జేయడానికి, తన కుడివైపున మారుతిని కూర్చోమని ఒక సైగ చేసాడు. భరద్వాజ మహర్షి చేసేదిలేక ఆ అరటి ఆకులోనే ఒక ప్రక్కన హనుమంతునికి వడ్డించాడు. భోజన కార్యక్రమం ముగిసిన తరువాత అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ శ్రీరాముడు ఈవిధంగా వివరించి చెప్పాడు.
“శ్రీరాముని పూజలోగాని, మారుతిపూజలోని గానీ ఎవరైతే మాకు అరటిఆకులో అరటిపండ్లను అర్పిస్తారో, వారికి మా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాకుండా, జ్యేష్ఠమాసం శుక్ల తదియనాడు ఎవరైతే మా ఇద్దరికి సేవ చేస్తారో, వారి తరతరాలకు సంతానలేమి ఉండదు. గృహస్థులు అతిథిసేవల్లో అరటి ఆకును వినియోగించితే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి”.