మంగళ గౌరీ అంటే ఎవరో కాదు.. సాక్షాత్తు పార్వతీదేవి. ఈ దేవినే మంగళగౌరీగా పిలుస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ‘ఐదోతనం’ జీవితాంతం నిలుస్తుందని చాలా మంది నమ్మకం. ఈ వ్రతం గురించి శ్రీక్రిష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. గౌరీ నోము ఎలా ఆచరించాలి ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకి గోరింటాకు, ముద్దపసుపు కుంకుమలు, కుంకుడు కాయలు, నువ్వులనూనె ఇచ్చి మా యింటికి తాంబూలము తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించాలి. ముత్తైదువులు, నోము ఆచరించే వారు గోరింటాకు పెట్టుకోవాలి.
రెండవ రోజు భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనము చేయాలి. తెల్లవారినాక అభ్యంగన స్నానమాచరించి, సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి. బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్ళను చేసి వాటిని వండి గౌరీ దేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను ఐదుగురు ముతైదువులకు వాయనమివ్వాలి. ఇలా ఐదు సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెబుతారు.
సమస్త శుభాలు చేకూరాలని కోరుతూ మధ్యాహ్నం గౌరీ పూజను చేయాలి. ఐదు దారపు పోగులు పోసి, ఐదు ముడులు వేసి, ఏడు తోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి, మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లం కలిపి, పచ్చి చలిమిడి చేసి, ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యం పెట్టాలి. పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథ చెప్పుకోవాలి. ఈ వ్రత కథ ఏమిటంటే పూర్వం ఓ వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజు గారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళతద్ది నాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారముతో దైవ నింద చేసి నోము నోచుకోలేదు.
ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్తారు. అంతేగాక ఆమె మహా వ్యాధి బారిన పడుతుంది. తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్ది నోము నోచుకొని, తన సంపదని తిరిగి పొంది, ఆరోగ్యస్తురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి, మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది. గర్విష్టికే ఈ నోము వల్ల ఇంతటి సద్గతి లభించింది కదా ! సత్ప్రవర్తనతో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన ఫలితముంటుందో ఊహించుకోమని ఈ కథలోని నీతి.
పూజ అయ్యాక నైవేద్యం గౌరిదేవి వద్ద పెట్టి తోరము చేతికి కట్టుకుని 5 గురికి భోజనము వడ్డించాక ఒక్కొక్కరికి ఒక వాయనము ఇవ్వాలి. వాయనము ఇచ్చేటపుడు ఇస్తి వాయనము పుచ్చుకొంటి వాయనము ఇస్తి వాయనము పుచ్చుకొంటి వాయనము ముమ్మాటికి ఇస్తి వాయనము ముమ్మాటికి పుచ్చుకొంటి వాయనము వాయనము తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని ఇలా 5గురికి ఇవ్వాలి.
అందరికి తోరములు చేతికి కట్టాలి. ముడివేయకూడదు. బియ్యం పిండి ముద్దతో కుందిలాగ చేసి, దానిలో ఆవునేతితో తడిపిన కుంభవత్తి పెట్టి, 5 గురి ఇస్తరాకుల ముందు వెలిగించాలి. అవి కొండెక్కిన తరువాత జ్యోతితో సహా చలిమిడిని తినాలి. నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించాక భోజనం చేస్తారు. 5 పోగులకు పసుపు రాసి, 3 చోట్ల పూలు ముడివేసి, 2 చోట్ల ఉత్త ముడి వేయచ్చు. ఈ నోము పుట్టింటిలోకాని అత్తగారింటిలోకాని చేయవచ్చు.