వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడని ప్రతీతి. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడని అంటారు. ప్రమథగణాలకు అధిపతి గనుక గణపతి అంటారు. పెద్ద ఉదరంతో అలరారుతుంటాడు గనుక లంబోదరుడని అంటారు. మూషికాన్ని వాహనంగా చేసుకున్నందున మూషికవాహనుడని అంటారు. ఏనుగు తల కలిగి ఉండటం వల్ల గజాననుడని, ఒక దంతం విరిగి ఉండటం వల్ల ఏకదంతుడని అంటారు. వినాయకుడు ఎందరికో ఇష్టదైవం. దేశదేశాల్లో వినాయకుడి ఆలయాలు ఉన్నాయి, ఆరాధకులూ ఉన్నారు.
సనాతన సాంప్రదాయంలో వినాయకుడికి ప్రత్యేకమైన మతం కూడా ఉంది. వినాయకుడే ప్రధాన దైవంగా ఆరాధించే మతాన్ని గాణపత్యం అంటారు. వినాయకుడికి ఎన్నో నామాలు ఉన్నట్లే, ఎన్నో రూపాలు కూడా ఉన్నాయి. వినాయకుడి కథ, వినాయక చవితి పూజావిధానం దాదాపు అందరికీ తెలిసినదే. వినాయకుడికి గల అరుదైన ఆలయాల గురించి తక్కువ మందికి తెలుసు. అలాంటి ఒక అరుదైన, ప్రత్యేకత కలిగిన వినాయకుడి ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
అయితే ఇప్పటివరకు కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయ అని తెలుసు. ఈ ఆలయంలో మనకి నచ్చిన వస్తువులను వదిలేసి ఆ దేవుడికి మన కోరిక తెలియజేయడంతో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.
అయితే ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారు రోజుకు కొంత పరిమాణంలో పెరుగుతున్నారని స్థానికులు చెబుతుంటారు.ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుడి తరహాలోనే కేరళలోని మధుర్ గ్రామం శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం కూడా పెరుగుతోందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు.
కేరళ బోర్డర్ లోని కసార్గాడ్ పట్నానికి అతి సమీపంలో మధుర్ మహాగణపతి అనే ఆలయం ఉంది. ఈ ఆలయంలో నిజానికి గణపతి బదులు మూలవిరాట్ శివుడు స్వయంభుడని చెబుతారు.
ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్వకాలంలో మధుర అనే ఒక మహిళ ముందుగా ఆ ప్రాంతంలో శివలింగం ఉండటం కనుగొన్నారు.
ఆ తర్వాత ఆ శివలింగం చుట్టే ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.ఈ శివలింగాన్ని ముందుగా మధుర అనే మహిళ కనుగొనడం వల్ల ఈ ఆలయాన్ని మదుర్ మహాగణపతి ఆలయం అని పిలుస్తారు.
ఈఆలయంలోని స్వామి వారు ముందుగా ఒక మహిళకు దర్శనం ఇవ్వటం వల్ల ప్రతి రోజు తొలి దర్శనాన్ని మహిళకే కల్పించడం ఈ ఆలయ ప్రత్యేకత. అదేవిధంగా ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం ఆలయ పూజారి పిల్లవాడు ఆలయానికి వచ్చారు.
ఆ పిల్లవాడు ఆడుకుంటూ గర్భగుడిలోకి ప్రవేశించి వినాయకుడి బొమ్మ గీసాడు, ఈ క్రమంలోనే వినాయకుడి బొమ్మ నుంచి రూపం ఆవిర్భవించడం మొదలైంది.
అంతేకాకుండా ఈ రూపం రోజురోజుకు పెరుగుతోందని భక్తులు విశ్వసిస్తారు. ఈ విధంగానే పరమేశ్వరుడికి వినాయకుడికి కలిపి పూజలను నిర్వహిస్తారు.ఈ ఆలయంలోని వినాయకుడిని కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తుంటారు