మనదేశంలో జరుపుకునే ప్రతి పండగకి ఎంతో విశిష్టత ఉంటుంది. దాని వెనుక అనేకానేక పరమార్ధాలు దాగి ఉంటాయి. ప్రతి పండుగ ఏదో ఒక విధంగా ప్రకృతి తో మమేకమై ఉంటుంది. అలాంటి పండుగలలో దసరా ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేదే దసరా.
- దుర్గా దేవి మహిషాసురుడు అనే రాక్షసున్ని సంహరించిన రోజు. అందుకే ఆ క్షణాలను గుర్తు చేసుకునేందుకు ప్రజలు పండుగ జరుపుకుంటారు. దుర్గామాతను నవ రాత్రుల పాటు వివిధ రూపాల్లో భక్తులు కొలుస్తారు. చివరి రోజున విజయదశమి వస్తుంది. ఆ రోజున ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అనేక ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతాయి. అయితే అదే రోజున చాలా మంది ఆయుధ పూజ కూడా చేస్తారు. ఈ క్రమంలో దసరా పండుగను గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
- పూర్వం ఒకప్పుడు మహిషాసురుడనే రాక్షసుడు జనాలను బాగా పీడించేవాడు. దేవతలను హింసించేవాడు. అయితే పేరుకు తగినట్టే (మహిషం అంటే దున్నపోతు) ఆ రాక్షసుడి తల దున్నపోతు తలగా ఉండేదట.
![](https://wirally.com/wp-content/uploads/2021/12/2-Rahasyavaani-18-1.jpg)
- ఈ క్రమంలో అతన్ని సంహరించడం కోసం దేవతలు దుర్గా దేవిని సృష్టిస్తారట. అయితే దుర్గా దేవిని చూసిన మహిషాసురుడు ఆమె అందానికి ముగ్దుడై ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతాడు. అయితే దుర్గా దేవి అతనికి షరతులు పెడుతుంది. తనతో యుద్ధం చేసి గెలిస్తేనే పెళ్లి చేసుకుంటానని దుర్గ చెబుతుంది.
- దీంతో మహిషాసురుడు దుర్గాదేవితో యుద్ధం చేస్తాడు. అది 9 రోజులు సాగుతుంది. చివరకు 9వ రోజున దుర్గాదేవి మహిషాసురున్ని అంతం చేస్తుంది. అతని తల నరుకుతుంది. దీంతో ప్రజలు సంబురాలు చేసుకుంటారు. అప్పటి నుంచి విజయదశమి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు.
![](https://wirally.com/wp-content/uploads/2021/12/3-Rahasyavaani-18-1.jpg)
- అయితే ఆ రాక్షసుడి దున్నపోతు తలను దేవి ఆ రోజున నరుకుతుంది కాబట్టి, ఇప్పటికీ మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దున్నపోతుల తలలను ఒక్క వేటుతో నరికి వాటిని దుర్గా దేవికి సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది.
- ఇక దుర్గా దేవి 9 రోజుల పాటు 9 రూపాల్లో దర్శనమిస్తుందని మనకు తెలిసిందే. అయితే మొదటి మూడు రోజులు దుర్గా దేవి రూపాల్లో, తరువాత 3 రోజులు లక్ష్మీ దేవి రూపాల్లో, ఆ తరువాత చివరి మూడు రోజులు సరస్వతి దేవి రూపాల్లో మనకు దర్శనమిస్తుంది.
- ఈ క్రమంలో 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దేవి భక్తులకు కనువిందు చేస్తుంది. అయితే పూర్వం ఒకప్పుడు రాముడు కూడా దుర్గాదేవిని 9 రోజుల పాటు పూజించాడట. దీంతో రాముడు రావణున్ని యుద్ధంలో సులభంగా అంతమొందించాడని చెబుతారు.
![](https://wirally.com/wp-content/uploads/2021/12/1-Rahasyavaani-18-1.jpg)
- ఇక దుర్గాదేవి నవరాత్రులకు సంబంధించి మరొక విషయం కూడా ఉంది. అదేమిటంటే… ప్రతి ఏటా 9 రోజుల పాటు తన తల్లి దగ్గర ఉండే వరాన్ని దుర్గ శివుడి వద్ద పొందిందట. దీని ప్రకారం తన తల్లి అయిన భూమి వద్ద దుర్గ ఏటా 9 రోజుల పాటు ఉంటూ వస్తుందట. అందుకనే ఆ రోజులను మనం నవరాత్రులు అని జరుపుకుంటున్నాం. చివరి రోజున దసరాను జరుపుకుంటూ వస్తున్నాం. చాలా ప్రాంతాల్లో దసరా రోజున ఆయుధ పూజ చేస్తారు కదా. ఇనుప వస్తువులు, పనిముట్లను ఎక్కువగా పూజిస్తారు.