పూర్వం అగస్త్య మహర్షి దేశంలో వివిధ ప్రదేశాలలో శివలింగాలని ప్రతిష్టించి పూజలు చేసాడు. అలా అగస్త్య మహర్షి ప్రతిష్టించిన లింగాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. ఇక్కడ పూర్వం నంది కొమ్ముల నుండి వెలుగు రేఖలు వచ్చాయని స్థల పురాణం చెబుతుంది. మరి అలా రావడం వెనుక కారణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి దగ్గరలో నంది వెలుగు అనే గ్రామంలో శ్రీ అగస్తేశ్వరాలయం ఉంది. అగస్త్య మహర్షి కాశి విశ్వేశ్వరుని వదిలివచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్టించాడు. అయన ప్రతిష్టించిన శివలింగాలలో నంది వెలుగు గ్రామంలో ని ఈ శివలింగం ఒకటి. ఈ ఆలయం గొప్ప శైవక్షేత్రంగా చెబుతారు. ఈ ఆలయానికి అత్యంత పురాతనమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం అగస్త్య మహర్షి ప్రతిష్టించిన ఈ శివలింగం మానవ సంచారం లేని ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఉండేది. అయితే చాళుక్యులు పరిపాలిస్తున్న రోజుల్లో శివభక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఈ అరణ్య ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ఆలయం కనిపించింది. ఇక మహాశివభక్తుడైన విష్ణువర్ధనుడు అగస్తేశ్వర స్వామిని దర్శించి ఆ స్వామికి నిత్యార్చన జరగాలని భావించాడు.ఆ మహారాజు అమూల్యమైన రత్నాలను వినాయకుని బొజ్జలోను, నందీశ్వరుని కొమ్ములలోను నిక్షిప్తం చేయించారు. వినాయకుడి బొజ్జలో రత్నాల నుండి వెలువడే తేజ పుంజాలు నంది కొమ్ములలోని రత్నాలపైనా పడి పరావర్తనం చెంది మూలవిరాట్టు పాదాలపై పడి నిత్యార్చన చేసేలా అతి గొప్పగా నిర్మాణం చేసారు. ఇలా నంది కొమ్ములనుండి వెలుగు రేఖలు రావడం వలన ఆ గ్రామానికి అప్పటినుండి నంది వెలుగు అనే పేరు వచ్చినది. కొంత కాలం తరువాత విగ్రహాలలో విలువైన రత్నాలు ఉన్నాయని తెలుసుకున్న కొంతమంది దుండగులు గణపతి విగ్రహాన్ని, నందుకొమ్ములని ధ్వంసం చేయడంతో ఆ పూర్వ వైభవం కాలగర్భంలో కలిసిపోయింది. ఇలా ఎంతో వైభవం కలిగిన ఈ ఆలయంలోని అగస్తేశ్వరస్వామికి పర్వదినాలలో ప్రత్యేక పూజలతో పాటు ఉత్సవాలు గొప్పగా జరుగుతాయి.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.