ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఆంజనేయస్వామి తో పాటు ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి కూడా భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని పురాణం. ఇంకా తిరుపతిలో చెల్లించవలసిన మొక్కులను ఈ ఆలయంలో చెల్లించుకుంటే ఆ ఫలితం లభిస్తుందని చెబుతుంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, ఓల్డ్ మిర్జాగూడ, మల్కాజ్ గిరిలోని శ్రీ ఆంజనేయ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ఇది చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ చరిత్ర ఏనాటిదో తెలియరాలేదు, సుమారు 100 సంవత్సరాల క్రితం నాటిదని, స్వయంభువు అని చెబుతారు. ఇచట స్వయంభువైన ఆంజనేయుడు తూర్పుముఖంగా ప్రతిష్టించబడి దక్షిణముఖంగా చూస్తున్నాడు. ఈయన స్వయంభువుగా వెలసిన స్వామి కావడం వలన భక్తులు కోరిన కోర్కెలు వెంటనే తీరడం వలన స్వామిని దర్శించడానికి భక్తులు వేల సంఖ్యల్లో వస్తుంటారు. ఆంజనేయస్వామి ఆలయానికి పడమర వైపు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. ఆయనకు ఎడమవైపున అలమేలుమంగా, కుడివైపు శ్రీ ఆండాళ్ అమ్మవారు కొలువై ఉన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి ఎదురుగా గరుడాళ్వార్, వినాయకుడు కొలువై ఉన్నారు. ఇంకా శ్రీ ఆంజనేయుని వెనుకవైపు ప్రాంగణంలో నవగ్రహ మంటపం ఉన్నది. ఈ విధంగా వెలసిన వేంకటేశ్వరస్వామి వారికీ బ్రహ్మోత్సవాలు ఏడు రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇంకా ఆంజనేయస్వామివారికి ప్రతి మంగళవారం, శనివారం, వేంకటేశ్వరస్వామి వారికీ శనివారం, విశేషంగా బుధవారం అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు సార్లు కల్యాణోత్సవములు జరుగుతాయి. ఈ ఆలయ ప్రాంగణంలో గల గణపతి ఆలయంలో వినాయకుని నిత్యపూజలు, అర్చనలు జరుపుతారు. ఈ ఆలయంలో హనుమంతునికి ప్రతినిత్యం ధూప దీప నైవేద్యాలతో పాటు, ఆకుపూజలు నిర్వహిస్తారు. ఇక హనుమజయంతి నాడు వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు.