కరోనా లాక్ డౌన్ వల్ల చాలా వరకు ఇళ్లకే పరిమితమైపోయారు. ఇంకా పెద్ద కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ పాటిస్తున్నాయి. కొత్త వేరియంట్ కేసులుపెరుగుతుండడంతో మళ్ళీ లాక్ డౌన్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ లాక్ డౌన్ వల్ల ఎక్కువ సంశయం ఇళ్లలో గడపడం జరుగుతోంది. దాంతో ప్రస్తుతం చిన్నా, పెద్దా అందరూ ఎక్కువగా కంప్యూటర్, లేదా స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటున్నారు. గంటల సమయం కంప్యూటర్ వర్క్ చేయడం, సెల్ ఫోన్ వాడటం వల్ల కంటి చూపు సమస్యలు ఎదురవుతుంటాయి.

కంటి అలసట స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామన్గా ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.ముఖ్యంగా గంటలు తరబడి ల్యాప్టాపుల ముందు పని చేసే వారు తరచూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కంటి సమస్యను విస్మరిస్తే మరింత ప్రమాదకరంగా మారేందుకు అవకాశం ఉంటుంది. కళ్లపై వత్తిడి ఎక్కువైతే మంట, నొప్పి, చూపు కోల్పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.
పని ఎక్కువగా చేసినప్పుడే కాదు నిద్ర సరిగా లేనప్పుడు, ప్రయాణాల సమయంలో కూడా కళ్ళు అలసటకు గురి అవుతాయి. కళ్ళు తీవ్రంగా స్ట్రెయిన్ అయినప్పుడు ఏ పని పైనా దృష్టి సారించలేకపోతుంటారు. కళ్ళు మూతలు పడిపోతుంటాయి. తల తిరుగుతున్నట్టు ఉంటుంది. అలాంటి సమయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ లో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే కంటి అలసట నుండి బయటపడేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

కళ్లపై ఒత్తిడి నివారించడానికి కంప్యూటర్ లు లేదా ఇతర గాడ్జెట్ లలో డార్క్ మోడ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో అప్పుడప్పుడు కంటి రెప్ప వేయకపోయినా, కళ్లు స్ట్రెయిన్, డ్రైనెస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే కంప్యూటర్ పై పని చేసే సమయంలో కొద్ది సేపు విరామం తీసుకోవాలి.
కంటిలో నొప్పిగా అనిపిస్తే కొద్దిగా నీటిని వేడి చేసి అందులో దూదిని నాన బెట్టాలి. ఆ తరువాత ఈ నీటిలోని దూదిని తీసి కళ్లకు పట్టించాలి. అవసరమైతే కళ్లపై కొద్దిసేపు కూడా ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది. ఇంకా కళ్లు పొడిగా అనిపిస్తే కంటి చుక్కల మందు ఉపయోగించడం శ్రేయస్కరం.

అలసిన కళ్ళకు ఉపశమనాన్ని అందించడంలో ఆలుగడ్డ గ్రేట్గా సహాయపడుతుంది. పీల్ తీసిన ఆలుగడ్డ తీసుకుని మెత్తగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని కొంత సమయం పాటు ఫ్రిజ్ పెట్టి, ఆ తర్వాత దూది సాయంతో కంటిపై అప్లై చేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.ఇలా చేస్తే కంటి అలసట త్వరగా దూరం అవుతుంది.

అలాగే ఒక బౌల్లో కలబంద నుంచి జెల్ తీసుకుని వేసుకోవాలి. ఇందులో తేనె వేసి బాగా కలుపుకునికంటిపై అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత కూల్ వాటర్తో కళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.

కంటి అలసటను తగ్గించడంలో బేబీ ఆయిల్ కూడా సూపర్గా హెల్ప్ చేస్తుంది.బేబీ ఆయిల్ను వేళ్లతో కళ్లపై అప్లై చేసుకుని. సవ్యదిశలో మూడుసార్లు, ఆ తర్వాత అపసవ్య దిశలో మరో మూడుసార్లు గుండ్రంగా తిప్పుతూ మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత పావు గంట పాటు విశ్రాంతి తీసుకుంటే. కళ్లు రిలాక్స్ అయిపోతాయి. కీరదోస ముక్కలను కళ్ళ మీద పెట్టుకున్న అలసిన కళ్ళకు మంచి ఉపశమనం కలుగుతుంది.
పడుకోవటానికి ముందు తప్పనిసరిగా కళ్ళను శుభ్రం చేసుకోవాలి. బయట నుంచి ఇంటికి రాగానే ముందుగా కళ్ళను కడుక్కోవాలి. అలాగే రాత్రి పడుకొనే ముందు చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే ముఖం తాజాగా ఉంటుంది. కొన్ని సార్లు కళ్ళు బాగా అలిసినప్పుడు కనురెప్పలు వాలిపోతాయి.అటువంటి సమయంలో కళ్ళ మీద చల్లని టీ బ్యాగ్స్ పెట్టుకుంటే అలసట తగ్గుతుంది. ఈ విధంగా ప్రయాణం చేసి వచ్చినప్పుడు మరియు ఎండలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు పెట్టుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

ఎక్కువ మంది కళ్ల అలసట పొగొట్టడానికి చల్లని నీళ్లతో కడుగుతుంటారు. ఇది శ్రేయస్కరమే. అయితే కళ్లపై నేరుగా ఐస్ ను పెట్టకూడదు. ఏదైనా గుడ్డ (క్లాత్) తీసుకుని కంటి రెప్పలు మూసి ఐస్ ను పెట్టుకోవచ్చు. ఇక పచ్చి పాలను ఐస్ ట్రేలో వేసి ఐస్ చేసుకోవాలి. ఈ ఐస్ ముక్కలను ఒక కాటన్ క్లాత్ చుట్టి, కంటిపై అద్దుకోవాలి. ఇలా చేసినా కూడా కంటి అలసట పరార్ అవుతుంది.
‘ఐ బాత్’ కూడా అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. కంటికి స్నానం అంటే.. ఒక బౌల్ నిండా నీళ్లు పోసి కళ్ళు బాగా తెరచి ముఖాన్ని బౌల్ లో ముంచితే కంటిలో ఉన్న దుమ్ము,ధూళి అంతా బయటకు వచ్చేస్తుంది. కళ్ళు రిలాక్స్ అవుతాయి.