కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని కొలిచే భక్తులు ఎక్కువ గానే ఉంటారు. అలానే స్వామి వారి ఆలయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. వీటిలో ఒక్కొక ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది.. అలంటి ప్రత్యేకతలు కలిగింది దశావతార శ్రీ వెంకటేశ్వర ఆలయం.. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది.. ఈ ఆలయ విశిష్టతలేంటి.. ఇపుడు తెల్సుకుందాం.. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సమీపంలో ఉన్న లింగమనేని టౌన్షిప్లో ఏకశిలతో శ్రీమహావిష్ణువు ఏకాదశ రూపాలు అయిన 11 అడుగుల ఎత్తున్న దశావతార శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహా రూపంలో కొలువై ఉన్నాడు…
ఈ ఆలయంలోని విగ్రహ ప్రతిష్ట దత్త పీఠాధిపతి అయిన గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా జరిగింది. ఈ దశావతార విగ్రహం భక్తులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంది. కలియుగంలో ప్రత్యక్ష అవతారమంటే ఇదేనా అన్నట్టు ఉంటుంది.. ఈ విగ్రహం. విష్ణుమూర్తి 21 అవతారాలలో అతి ముఖ్యమైనవి దశావతారాలు. శ్రీహరి దశావతారాలకు వేర్వేరుగా ఆలయాలు ఉన్నప్పటికీ అత్యధికంగా నారసింహా, శ్రీకృష్ణ, శ్రీరాముడు, వెంకటేశ్వర క్షేత్రాలే అత్యధికంగా దర్శనమిస్తాయి.
ఇక కూర్మావతారానికి సంబంధించి ప్రపంచంలో కూర్మనాథ ఆలయం ఒక్కటే ఉంది. ఇక మిగిలినవి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, వేంకటేశ్వరవతారం, కల్కి అవతారాలు.. ఈ దశావతారాలను ఒకే విగ్రహంలో ఉండేలా చూడటం అనేది ఎంతో కన్నుల పండువగా ఉంటుంది.. ఈ అవతారాలన్నీ శ్రీవెంకటేశ్వరుని రూపంలో ఒదిగి ఉండటం ఇక్కడ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రపంచంలో మరెక్కడా కూడా ఇలా దశావతార శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం కనిపించదు.. అందుకే ఈ ఆలయం ఇంతటి విశిష్టతను సంతరించుకుంది.
తిరుమల శ్రీవారి పాదాలతోనూ, అలాగే మోకాళ్ల వరకూ మత్స్యావతారంలో, నడుము వరకూ కూర్మావతారంలోనూ దర్శనమిస్తాడు స్వామి. ఇక శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖంగా ఉండగా ఈ విగ్రహం ఎనిమిది చేతులతో ఉంటుంది… వామనావతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, అలాగే రామావతారానికి సూచికగా బాణం, విల్లుమ్ములు, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం.. విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖు, చక్రాలు మరో రెండు చేతులకు అలంకరించారు. ఇలా దశావతారాలన్నింటిని ఒకే దగ్గర దర్శించుకోవటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.. ఇక్కడి స్వామి వారి శిల్పం కర్నూలుజిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి వి సుబ్రమణ్య ఆచార్యులు రాతితో నిర్మించారు.