ప్రస్తుత రోజుల్లో పేపర్ కప్పుల వాడకం బాగా పెరిగిపోయింది. బయట టీ స్టాల్స్ దగ్గర ఇలాంటి పేపర్ కప్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఖర్చు తక్కువ మరియు వాడి పడేయొచ్చనే ఉద్దేశంతో వీటిని ఉపయోగించడానికి చిరు వ్యాపారాలు మొగ్గు చూపుతుంటారు.
అయితే, వాటిల్లో టీ తాగితే అనారోగ్యంపాలవుతారని పరిశోధకులు చెబుతున్నారు. డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో మూడుసార్లు 100 మిల్లీలీటర్ల చొప్పున టీ తాగడం వల్ల 75 వేల అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోనికి వెళతాయని పరిశోధకులు తేల్చారు.
80-90 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి కలిగిన 100 మిల్లీలీటర్ల ద్రవ పదార్థం ద్వారా దాదాపు 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్ కణాలు మనలోకి చేరతాయని అన్నారు. దీంతో క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత లోహాలు శరరీంలోకి వెళ్తాయని తెలిపారు. పేపర్ కప్పుల్లో టీ పోసినప్పుడు ఆ పేపర్లోని మైక్రోప్లాస్టిక్ కణాలతో పాటు ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోయి శరీరంలోకి వెళ్తున్నాయని చెప్పారు.
పేపర్ కప్పులు హైడ్రోఫోబిక్ ఫిల్మ్ సన్నటి పొరతో తయారవుతాయని వివరించారు. ఇందులోనూ పాలీ ఇథలీన్ ఉంటుందని చెప్పారు. టీ లేక ఇతర ఏ వేడి ద్రవం పోసినా 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్ లేయర్లో చర్య జరుగుతుందని వివరించారు.