మనం కాస్త అలిసిపోయినట్టు అనిపించినా లేదంటే బయటకి వెళ్లి వచ్చి తలా నొప్పిగా అనిపించినా కొంచెం నూనె తీసుకోని తలను కాసేపు అలా మర్దనా చేస్తే క్షణాల్లో నొప్పి మాయమవుతుంది. కీళ్లు పట్టేసినా కూడా నూనెతో మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది. అందుకే మసాజ్కు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. పలు రకాల నూనెలను ఉపయోగించి శరీరానికి మర్దనా చేసి తరువాత స్నానం చేయాలి. ఇలా వారంలో 1, 2 సార్లు చేసినా చాలు, ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
పంచకర్మ వంటి థెరపీల్లోనూ మసాజ్లకు ప్రాధాన్యతను కల్పించారు. అయితే శరీరంతోపాటు పాదాలకు కూడా అప్పుడప్పుడు మసాజ్లు చేయాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలోని వివిధ అవయవాలకు పాదాలతో సంబంధం ఉంటుందనే సంగతి తెలిసిందే. పడుకునే ముందు పాదాలను మసాజ్ చేయడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. రక్తప్రసరణను మెరుగుపర్చడానికి తోడ్పడుతుంది. కాబట్టి రోజూ షూ వేసుకునేవారు, కదలకుండా ఒకే చోట కూర్చొని పని చేసేవారు రాత్రి సమయంలో పాదాలను మసాజ్ చేసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల రిలాక్స్గా అనిపించడంతోపాటు.. సెక్స్ లైఫ్ను ఎంజాయ్ చేయడానికి ఉపకరిస్తుంది. యాంగ్జైటీని తగ్గించవచ్చు.
నిద్రకు ఉపక్రమించే ముందు పది నుంచి పదిహేను నిమిషాలపాటు మసాజ్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. పడుకునే ముందు నిటారుగా కూర్చొని పాదాలను ఒళ్లోకి తీసుకొని మసాజ్ చేసుకోవచ్చు. గోరువెచ్చని నూనెతో మసాజ్ చేస్తే చక్కటి రిలీఫ్ లభిస్తుంది. పాదాలపై ఓ క్రమ పద్ధతిలో చేతివేళ్లతో సున్నితంగా నొక్కడం వల్ల ఫలితం ఉంటుంది. ఒత్తిడిని తొలగించడానికి, అనారోగ్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన రిఫ్లెక్సాలజీ అనే వైద్య పద్ధతిలో పాదాలను మసాజ్ చేయడం అనేది ఓ భాగం. అరికాలు, చీలమండల, పాదంపై ఉండే భాగాలపై చూపుడు వేలు, అరచేయి, బొటనవేలి సాయంతో నిర్ణీత మొత్తంలో ఒత్తిడి కలిగిస్తారు. కాలి బొటనవేలును మసాజ్ చేయడం వల్ల ఊపిరితిత్తులు, మెదడుకు ఉపయుక్తంగా ఉంటుంది. మిగతా మూడు వేళ్లను మసాజ్ చేయడం వల్ల పంటి నొప్పులు తగ్గుముఖం పడతాయి.
శరీరంలోని పలు అవయవాలకు అనుసంధానం అయ్యే నాడులు పాదాల్లో ఉంటాయి. అందువల్ల పాదాలకు మసాజ్ చేస్తే ఆయా అవయవాలు ఉత్తేజం చెందుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు నయం అవుతాయి. అయితే పాదంలో ఎక్కడ ఏ భాగం ఉంటుందో ఎక్కడ మసాజ్ చేయడం వలన ఏ నొప్పిని నయం చేసుకోవచ్చు అనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరికీ దీనిపై అవగాహన లేకపోవడమే. అందుకే పాదంలో ఎక్కడ మసాజ్ చేస్తే ఏ అవయవం రిలాక్స్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దృష్టి సమస్య, కళ్ళలో పుండ్లు ఏర్పడడం, ఎరుపు రంగు, నొప్పితో సహా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. రెండవ, మూడవ వేళ్ళకు కాలికి దిగువన ఉన్న ప్రాంతానికి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలతో బాధపడేవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కంటి చూపు సమస్యలు, కండరాల బలహీనత, స్పర్శ తగ్గుతుండడం, ఏకాగ్రత లేకపోవడం, అలసట వంటి సమస్యలు ఉన్నవారు ఈ ఫుట్ మసాజ్ చేసుకోవాలి. దీంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పాదాల చివర్లలో.. అంటే కాలి వేళ్లపై, పాదం వెనుక భాగంలో మర్దనా చేయాలి. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరానికి ఉత్తేజం లభిస్తుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
ఊపిరితిత్తులు పాదంలోని అడుగుల బంతుల మధ్య ప్రాంతానికి అనుసంధానించబడిందని చెబుతున్నారు. అస్తమాతో బాధపడుతున్న వారికి గొప్పగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైన శ్వాస తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వెంటనే వైద్యడిని సంప్రదించడం మంచిది.
తలనొప్పి సమస్యతో బాధపడేవారు ముందుగా రెండు కాళ్లకు చెందిన బొటనవేళ్లకు మసాజ్ చేయాలి. తరువాత మిగిలిన వేళ్లకు చేయాలి. వేళ్లను కొంత సేపు ఒత్తి పట్టుకుని తరువాత విడిచిపెట్టాలి. దీన్నే స్క్వీజ్ అండ్ రిలీజ్ టెక్నిక్ అంటారు. ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
ఈ కాలంలో మెడ నొప్పులు సర్వసాధారణం. పాదం బొటనవేలు కింద ఉన్న ప్రాంతాన్ని మసాజ్ చేయడం వల్ల మెడభాగంలోని నొప్పులు దూరమవుతాయి. ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఈ ప్రాంతాన్ని వేళ్ళతో మసాజ్ చేయాలి.
పాదాల నుంచి వెన్నెముకను కలిపే నాడులు అనుసంధానం అయి ఉంటాయి. అందువల్ల పాదాలను మసాజ్ చేస్తే వెన్నెముకకు శక్తి లభిస్తుంది. వెన్నెముక బలంగా మారుతుంది. మహిళలు గర్భం ధరించి ప్రసవించాక పాదాలు వాపులకు గురవుతుంటాయి. అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు పాదాలపై మసాజ్ చేయాలి. దీంతో మెటబాలిజం పెరుగుతుంది. పాదాల్లో నీరు తగ్గుతుంది. వాపులు తగ్గుతాయి.
మరీ ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పాదాలకు ఆయుర్వేద తైలంతో మసాజ్ చేయడం వంటి మంచి పద్ధతిని అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిద్ర సుఖం గా వస్తుంది. అలాగే రక్తప్రవాహాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని ప్రేరేపించి, ఆటోఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోపం, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. వినికిడి సామర్థ్యం మెరుగుపడుతుంది. పాదాలపై దద్దుర్లు రాకుండా నివారిస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా ఉండేలా చేస్తుంది.