రావణుడి కొడుకు మేఘనాధుడు వేసిన అస్త్రానికి లక్ష్మణుడు మూర్చపోతే హనుమంతుడు సంజీవిని తెచ్చి రక్షించాడని రామాయణం గురించి పరిచయం ఉన్నవారందరికీ తెలుసు. కానీ మేఘనాధుడు లక్ష్మణుడికి స్వయానా అల్లుడు అనే విషయం ఎంత మందికి తెలుసు… తనను చంపడానికి ప్రయత్నించిన మేఘనాధుడు, లక్ష్మణుడికి అల్లుడు ఎలా అయ్యాడు? అల్లుడైన తన మామను ఎందుకు చంపాలనుకున్నాడు అనేది తెలుసుకుందాం.
అసురుడైన మేఘనాధుడు ఓ రుషిని పీడిస్తూ ఆయన నుండి ఓ శాపాన్ని పొందుతాడు… పాముల వల్ల గానీ, పాముల ప్రభువు వల్ల గానీ మరణిస్తావనేది ఆ శాపం. తన అద్భుత పరాక్రమం వల్ల పాములు తనను చంపలేవని విశ్వసించిన మేఘనాథుడు ఓ రాక్షసగురువు సలహా కోరతాడు.
శేషనాగుడి అంశ ఈ భూలోకంలో లక్ష్మణుడిగా అవతరిస్తుందనీ, అతనే నిన్ను హతమార్చే ప్రమాదముందని గురువు సూచనప్రాయంగా చెబుతాడు. దీన్ని తప్పించుకోవటానికి మేఘనాథుడు సర్పలోక రాజు శేషనాగును జయించి, పరిహారంగా ఆ రాజు కూతురు సులోచనను పెళ్లి చేసుకుంటాడు.
సాక్షాత్తూ లక్ష్మణుడు శేషనాగు అవతారమే కాబట్టి, కూతుర్ని పెళ్లి చేసుకున్న తాను అల్లుడినే కాబట్టి, తనను లక్ష్మణుడు చంపబోడని మేఘనాథుడు భావిస్తాడు. అందుకే రామరావణ యుద్ధసమయంలో లక్ష్మణుడికి మరీ ప్రాణాపాయం లేకుండా మేఘనాథుడు పాశుపతాన్ని తక్కువ మోతాదులో ప్రయోగిస్తాడు.
దాదాపు మరణం అంచుల్లోకి వెళ్లిన లక్ష్మణుడి కోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తాడు. మేఘనాథుడు ఉన్నన్ని రోజులు ఈ యుద్ధానికి పరిసమాప్తి లేదని రాముడు చెప్పగానే మరుసటి రోజు లక్ష్మణుడు అల్లుడనే సంగతి మరిచి మేఘనాథుడిని నిస్సంకోచంగా వధిస్తాడు.