కొత్తగా ఇల్లు కానీ ఏదైనా భవనాలు నిర్మించినప్పుడు నవగ్రహాల శాంతి పూజ జరిపిస్తారు. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినపుడు అక్కడ కూడా నవగ్రహాలు దర్శించుకోవచ్చు. వివాహం ఆలస్యం అవడమో లేదా ఏదైనా చెడు జరుగుతుంది అంటే నవగ్రహాల శాంతి జరిపించమని పెద్దలు చెప్పడం మనం ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. అసలు నవగ్రహల శాంతి పూజ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం.
ప్రజలు లేదా రాజుల పతనం గానీ, ఔన్నత్యములుగాని, గౌరవ, అగౌరవాలు గాని, గ్రహాల సంచారము వల్లే ఏర్పడుతుంది. కావున నవగ్రహాలను ఆరాధించాలని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఎప్పుడైతే గ్రహం వల్ల మనకు పీడ కలుగుతుందో ఆ గ్రహమునకు శాంతి చేయాలి.
సంపదలు, శాంతి, వర్షము, ఆయువు, అభివృద్ధి, ఆరోగ్యము కోరుకునే ప్రజలు నవగ్రహ యజ్ఞాన్ని తప్పకుండా పాటించాల్సి వుంటుంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతులు అని తొమ్మిది గ్రహాలున్నాయి. ఈ నవగ్రహాలను ఆయా మంత్రములతో మండలముపై ఆవాహనము చేసి పూజించి, పంచామృతాలతో అభిషేకించాలి.
నైవేద్యములు, తాంబులాది ఉపచారము అర్పించి, తరువాత అగ్ని ప్రతిష్టాపనం చేసి సమిథులతో 108 సార్లుగాని, 28 సార్లుగాని యథాశక్తిగా హోమం చేసి ఆయా గ్రహాలకు నిర్ణయింపబడిన ధాన్యములను, వస్తువులను దానములుగా ఇచ్చి ధనాన్ని దక్షిణలుగా ఇవ్వాలి. ఇలా నవగ్రహ యజ్ఞం చేసిన వారు సంతుష్టులయి, చేసిన యజమానులకు కోరిన వరాలు ఇస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి.