భోజనం ముగించే ముందు ఒక ముద్దయినా పెరుగుతో తింటేనే భోజనం చేసిన భావన కలుగుతుంది కొందరికి. ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో ఖచ్చితంగా పెరుగు ఉంటుంది. సమ్మర్లో అయితే పొరబాటున కూడా మిస్ చేయరు. అంతలా పెరుగుకు అలవాటు పడిపోతుంటారు. రుచిలోనే కాదు, ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా కూడా పెరుగు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
- పాలతో పోల్చుకుంటే పెరుగులోనే ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి, పెరుగు తీసుకుంటే చర్మాన్ని, కేశాలను, గోర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలతో బాధ పడేవారు ఖచ్చితంగా పెరుగు తీసుకోవాలి. ఎన్నో పోషకాలు నిండి ఉన్న పెరుగు ప్రతి రోజు తీసుకుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది. అదే సమయంలో మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది. ఇక ఎముకలను, దంతాలను మరియు కండరాలను బలపరిచే కాల్షియం కూడా పెరుగులో సమృద్ధిగా ఉంటుంది.
- అయితే చాలా మంది చలి కాలం వచ్చిందంటే పెరుగు తినడం మానేస్తుంటారు. వింటర్ సీజన్లో పెరుగు తినడం వల్ల జలువు లేదా ఇతర శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని నమ్మడమే అందుకు కారణం. అయితే చలి కాలంలో ఎలాంటి భయం లేకుండా పెరుగు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- చలికాలంలో సాధారణంగా జలుబు, దగ్గు లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలో మార్పు, చలి కారణంగా సహజంగా ఉండే ఇబ్బందే ఇది. ముక్కులు పట్టేయడం, గొంతులో గరగరలా ఉండి గల్ల వస్తుంటుంది. అయుర్వేదం పరిభాషలో దీన్నే కఫం అంటారు. ఊపిరితిత్తుల అంతర్భాగంలో గోడలకు చెమ్మ పట్టి ఊరే ద్రవమే ఈ కఫం. చలికాలంలో ఇది ఎక్కువై జలుబు, దగ్గు లాంటి వస్తుంటాయి.
- ఈ సమయంలో పెరుగు తింటే కఫం ఇంకా ఎక్కువయ్యే చాన్స్ ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అస్తామా, సైనస్ లాంటి సమస్యలు ఉన్న వారిలో ఇది మరింత తీవ్రమై బాగా ఇబ్బందిపెడుతుంది. సో చలికాలంలో పెరుగు తినకపోవడమే మేలని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అసలు వద్దని సూచిస్తోంది. పోషకాల కోసం రాత్రులు పాలు తాగి, మధ్యాహ్నం వేళ పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం మేలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
- పెరుగులో శరీరానికి మేలు చేసే గుడ్ బ్యాక్టీరియాలు, బీ12 విటమిన్, కాలిషియం వంటి పోషకాలు ఫుల్గా ఉంటాయని సైన్స్ చెబుతోంది. రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ ఉపయోగపడుతుంది. అయితే శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా, జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తుంటే మాత్రం సాయంత్రం 5 తర్వాత పెరుగు తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్లు పగలు, రాత్రి పెరుగు తినవచ్చని.. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం పగలు మాత్రమే పెరుగును తినాలని వైద్యులు చెబుతున్నారు.
- చలికాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెట్టి తీసుకోవడం కంటే సాధారణంగా తీసుకోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిజ్ లో పెట్టుకున్న పెరుగును మాత్రం రాత్రి సమయంలో తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.