ప్రతి ఊరులోనూ ఎల్లమ్మ,పోచమ్మ,కట్ట మైసమ్మ ఇలా కొన్ని రకాల పేర్లతో అమ్మవారి ఏదో ఒక ఆలయం అనేది తప్పకుండ ఉంటుంది. అయితే బల్కంపేటలో వెలసిన ఎల్లమ్మ పోచమ్మ ఆలయం ఎలా వెలసింది, ఆ ఆలయం యొక్క గొప్పతనం ఏంటి అనేది మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని సంజీవరెడ్డి నగరానికి సమీపంలో బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి దేవస్థానం ఉంది. ఇక్కడి అమ్మవారు భక్తుల యొక్క ఎల్లా కోర్కెలు తీర్చే తల్లి కావటం వలన ఎల్లమ్మ తల్లిగా భక్తులు కొలుస్తున్నారు. ఆ జగజ్జనని పాద పద్మములను నమ్మి సేవించనవారి పాప దుఃఖములను పటా పంచలు చేసి శాశ్వతమైన ఆనందాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు.
మంత్రశాస్రంలో ప్రధానమైన దశమహావిద్యలలో చిన్న మస్తాదేవి ఒకరు. ఆ చిన్నమస్తదేవియే పరశురాముని తల్లి రేణుకాదేవిగా అవతరించింది. ఆ రేణుకాదేవియే నేడు కలియుగంలో ఎల్లమ్మ తల్లిగా ఆరాధించబడుతుంది. ఇలా అమ్మవారి రూపాలలో బాలా త్రిపురసుందరి దేవి ఒకరు. ఆ తల్లిని భక్తులు బాలా, బాలాంబిక, బాలాకాంబిక అని పిలుస్తుండేవారు. ఆ బాలికాంబీయే బల్కమ్మగా, ఆ అమ్మ కొలువై ఉన్న ప్రాంతం బల్కమ్మ పేటగా పిలవబడుతూ అది నేటి బల్కంపేటగా మారిందని పూర్వికులు ద్వారా తెలుస్తుంది.
ఈ ఎల్లమ్మ దేవత ఒక బావిలో భూమి ఉపరితలం నుండి సుమారు 10 అడుగుల దిగువన శయనరూపంలో తూర్పుములాగా చూస్తూ స్వయం భూమూర్తిగా శతకోటి ప్రభల తేజస్సుతో సర్వబీష్ట ప్రదాయని అయి భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుచున్నది. అమ్మవారి స్వయంభువు మూర్తి శిరస్సు వెనుక భాగమున ఒక బావి ఉంది. ఈ బావి నుండి ఉధ్భవించే జల ఊట నిరంతరం ఉధ్భవించడం ఇచ్చట ఒక ప్రత్యేకమైన విశేషం. ఈ జలాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఈ జలం సమస్త పాపాలనుండి, రోగాల నుండి విముక్తి కలిగిస్తుందని భక్తుల నమ్మకం.
చారిత్రక ఆధారాల ప్రకారం సుమారు 700 సంవత్సరాల పూర్వమే ఈ దేవాలయం ఉన్నట్లు, అప్పట్లో బావిలో ఉన్న స్వయంభువు అమ్మవారు నీటిమధ్యలో ఉండటం వలన దూరం నుండి దర్శించుకునేవారని తెలుస్తుంది. నైజం పరిపాలనలో శ్రీ రాజా శివరాజ్ బహద్దూర్ పరిపాలన కాలంలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తుంది. అప్పుడే ఈ ఆలయంలో మరొక ఆలయం నిర్మించి ఆ అమ్మవారితో పాటు దక్షిణభాగంలో పోచమ్మ తల్లి అమ్మవారిని క్షేత్రపాలకురాలుగా ప్రతిష్టించారు.
అమ్మవారు 10 అడుగుల దిగువన శయనరూపంలో నైసర్గిగా ఆకారంలో తూర్పుమూలముగా చేసి స్వయంభువుగా వెలసియున్నందున పై భాగంలోని మహామండపం నుండి ప్రతినిత్యం అఖండజ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ ఆలయ ప్రాగణంలో గల నాగదేవతాలయం పక్కన ప్రస్తుతం భక్తులు బోనాలు సమర్పించుటకు ఈ ఎల్లమ్మ అమ్మవారి రూపుతో ఒక విగ్రహాన్ని, పుషప్గిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతిస్వామివారు, విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూప నరేంద్రస్వామి వారి దివ్యహస్తలతో ప్రతిష్టించబడింది.
ఈ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని తమ ఆచార సంప్రదాయాల ప్రకారం బోనాలు సమర్పించుకుంటారు. తమ కోరికలు నెరవేరిన తరువాత తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో మరల అమ్మవారిని దర్శించి బోజనాది కార్యక్రమాలు నిర్వహించుకొనుట ఒక ఆచారంగా వస్తుంది.
ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్ల కళ్యాణము, ప్రతి ఆషాడమాసం చివరి ఆదివారంనాడు బోనాలు మరియు ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపబడుతాయి.