పరమ శివుడు స్వయంభువుగా వెలిసిన కాశీ క్షేత్రాన్ని దర్శించడం వలన మళ్లీ జన్మనేది ఉండదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే కాశీ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలనే కోరిక మనసులో బలంగా ఉంటుంది. పురాణపరమైన అనేక ఘట్టాలకు విశేషాలకు నెలవుగా కాశీ క్షేత్రం కనిపిస్తుంది.
పాపాలను పటాపంచలు చేసే ఈ క్షేత్రంలో పన్నెండు సూర్య దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో ఆలయం వెనుక ఒక్కో విశేషం వినిపిస్తూ ఉంటుంది. ఒక్కో ఆలయంలో సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పిలవబడుతూ, పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. వాటిలో విమలాదిత్యుని ఆలయం ఒకటి.
పూర్వం ‘విమలుడు’ అనే రాజు కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. దాంతో జీవితం పట్ల విరక్తితో ఆయన భార్యా బిడ్డలను వదిలి కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు. ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై, కుష్టువ్యాధి నుంచి విముక్తుడిని చేస్తాడు.
విమలుడు ప్రతిష్ఠించిన మూర్తి విమలాదిత్యుడు పేరుతో పూజలందుకుంటుందని అంటాడు. విమలాదిత్యుడిని పూజించినవారికి వ్యాధులు, బాధలు, దారిద్ర్య దుఃఖాలు ఉండవని సెలవిస్తాడు. అందువలన కాశీ క్షేత్రానికి చేరుకున్నవారు, ఇక్కడి సూర్య దేవాలయాలు తప్పకుండా దర్శించుకుంటూ ఉంటారు.