పురాతన కాలం నుండి భారతీయ వంటల్లో, ఆయుర్వేదంలో అల్లంను ఉపయోగిస్తున్నారు. నిత్యం అనేక వంటకాల్లో వారు అల్లంను వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే అల్లంతో శొంఠి తయారు చేస్తారు. అల్లాన్ని పాలలో ఉడకబెట్టి తరువాత దాన్ని ఎండబెడతారు. దీంతో తయారయ్యే పదార్థాన్ని శొంఠి అంటారు. ఎండిన అల్లం శొంఠి అవుతుంది.
అల్లం, శొంఠి రెండింటిలోను కొన్ని లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ, అల్లం ప్రధానంగా చలవచేస్తుంది. శొంఠి వేడి చేస్తుంది. జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది.
ఈ విధంగా అల్లంను శొంఠిలా తయారు చేసి తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి, అరచెంచా తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు, బరువూ అదుపులో ఉంటుంది.
శొంఠి తీసుకోవడం వల్ల అజీర్ణం సమస్య తగ్గుతుంది. తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం. పసి పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు. ఇది జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది. ఆకలిని పెంచుతుంది.
బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు. ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఆయాసం, ఉబ్బసం వ్యాధులు ఉన్న వారికి శొంఠి ఎంతగానో మేలు చేస్తుంది. శరీరంలో ఉండే శ్లేష్మం కరుగుతుంది. కంఠాన్ని శుద్ధి చేస్తుంది. గొంతు సమస్యలు పోతాయి. వాంతులు తగ్గుతాయి.
రోజు పొద్దున్న పరగడుపునే ఒక గ్లాస్ నీటిలో తేనె మరియు శొంఠి నిన్ కలుపుకొని తాగితే కొవ్వు తగ్గి శరీరపు బరువు మన అదుపులో ఉంటుంది. వేడి పాలల్లో శొంఠి ని కలుపుకొని తాగితే మూత్ర సంబంధమైన వ్యాదులు రాకుండా ఉంటాయి.
నీళ్ళ విరేచనాలవుతున్నప్పుడు శొంఠి పొడిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. చెంచాల శొంఠి కషాయంలో ఒక చెంచాడు ఆముదం కలిపి రాత్రి పడుకునేటప్పుడు సేవిస్తే విరేచనం సాఫీగా అవుతుంది. కడుపులో వాయువు తగ్గుతుంది. సయాటికా తగ్గుతుంది. ఇలా రోజు విడిచి రోజు మూడుసార్లు చేయవచ్చు.
వాము, కరక్కాయ, శొంఠి.. ఈ మూడింటిని కలిపి బెల్లంతో నూరి తీసుకుంటే కీళ్ళవాతం తగ్గుతుంది. ఆముదం పప్పు, శొంఠి, చక్కెరలను సమపాళ్ళలో కలిపి తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. బోదకాలు, మొలలు, కడుపుబ్బరం, పైత్యం, లివర్ సంబంధిత వ్యాధులకు శొంఠిని వాడవచ్చు.
దగ్గు జలుబు కఫం ఉన్నప్పుడు శొంఠి ని నీటిలో మరగబెట్టి తాగడం వలన ఉపశమనం కలుగుతుంది. వేడి వేడి టీ లేదా కాఫీ లలో కూడా శొంఠి పొడిని కలుపుకొని తాగితే జలుబు దగ్గు కఫం నుండి విముక్తి కలుగుతుంది. తీవ్రమైన జలుబుతో బాధపడే వారు కొంచెం శొంఠి పొడి ని బెల్లం లో కలుపుకొని రోజు మూడు సార్లు తింటే గుణం కనబడుతుంది.
లవంగాల పొడి శొంఠి పొడి రెండూ కలిపి నీటిలో మరగనిచ్చి తాగితే దగ్గు జలుబు కఫం మాటు మాయమవుతాయి. శొంఠి, మిరియాలు, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకుని కషాయం తయారు చేయాలి. దానికి చక్కెర కలిపి వేడిగా తాగితే ముక్కు దిబ్బడ, జలుబు వంటివి తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
శొంఠిని నీటితో అరగదీసి ఆ ముద్దను నొసటిపై, కణతలపై పూతగా పూస్తే ఏ కారణంతో వచ్చిన తలనొప్పికైనా కొద్దిసేపట్లో ఉపశమనం లభిస్తుంది. శొంఠి, నల్ల జీలకర్రలను కలిపి బాగా నూరి మెత్తగా పొడి చేసి, తేనెలో కలిపి కుంకుడు గింజ పరిమాణంలో తీసుకుంటే పక్షవాతరోగులకు ఉపశమనం కలుగుతుంది. శొంఠి పొడిని నిత్యం ఆహారంలో చిటికెడు మోతాదులో తీసుకోవచ్చు. లేదా ఆ పొడిని టీ, పాలలో కలిపి తీసుకోవచ్చు.