ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే అయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు. హనుమంతుడు లేని గ్రామం అంటూ ఉండదు. అయితే ఈ ఆలయ విశేషం ఏంటంటే, హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులో అర్దకొండ ఈ ఆలయ ప్రాంతంలో పడిందని పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థలపురాణం ఏంటి? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, కాణిపాకం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో అరగొండ గ్రామంలో ఎత్తైన కొండపై శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం ఉంది. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన సంజీవరాయ పుష్కరణి అనే కొలను విశేష ప్రాచుర్యాన్ని పొందింది. అతి పురాతనమైన ఈ ఆలయం చోళరాజుల కాలంలో నిర్మించినట్లుగా తెలియుచున్నది. ఈ క్షేత్రంలో ఎందరో యోగులు, మహర్షులు తపస్సు చేసిన గుహలు ఉన్నాయి. వనమూలికల ప్రభావించె సహజంగా ఏర్పడిన సంజీవరాయ పుషరిణి తిర్దాన్ని సేవిస్తే వ్యాధులు నయం అవ్వడమే కాకుండా మనోవాంఛలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, తేత్రాయుగ కాలంలో రామరావణుల మధ్య యుద్ధం జరుగుతుండగా, రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు లక్ష్మణుడిని మూర్ఛనుండి మేలుకొలపడానికి సంజీవిని తీసుకురావడానికి శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు జై శ్రీరామ్ అంటూ వాయువేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. కొద్దిసేపటికి ఆ పర్వతం పైన దిగి, సంజీవిని మొక్క ఎక్కడ ఉందొ తెలుసుకోలేక పర్వతాన్నే ఏకంగా పెకలించి, తీసుకొని వస్తుండగా కొండలో అర్దకొండ విరిగి నేలమీద పడింది. ఆ కొండపడిన ప్రాంతమే అర్ధగిరి. ఆ తరువుత ఈ ప్రాంతంలో ఒక ఒక గ్రామం ఏర్పడింది. ఆ గ్రామమే ఇప్పుడు అరగొండగా పిలవబడుతుంది.
శ్రీ ఆంజనేయస్వామి వారి చేతిలోని కొండ పడిన అర్ధగిరిపై వనమూలికలతో సహజసిద్దంగా ఏర్పడిన సంజీవరాయ పుష్కరిణి ఉన్నది. ఇది ఆరోగ్య వరప్రసాదం అని, సర్వ రోగ నివారిణి అని అక్కడి భక్తులు అంటారు. ఈ పుష్కర తీర్థం ఎప్పుడు చెడిపోదు, ఏనాటికి ఇంకిపోక తన మహిమలతో భక్తుల కొరికేలు తీరుస్తూనే ఉంది. ఇలా ఈ గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామిని దర్శనం చేసుకోవడం కోసం భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.