ఇప్పుడు మనం తింటున్న బియ్యం తెలుపు రంగులో ఉంటుంది. కానీ మన పూర్వికులు మనకు అద్భుత ఔషధ గుణాలు ఉన్న నల్ల బియ్యాన్ని ఎప్పుడో అందించారు. ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న కృష్ణ బియ్యాన్ని(నల్ల బియ్యం) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట గ్రామంలో కౌటిల్య అనే యువకుడు విజయవంతంగా పండిస్తున్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. యజుర్వేదం చదువుతున్న కౌటిల్య కృష్ణన్ వేదాల ఆధారంగా వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తున్నారు. కృష్ణ వ్రీహి అని పిలిచే ఈ కృష్ణ బియ్యానికి ఇటీవలే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. మణిపూర్, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ప్రాంతాల్లో కృష్ణ బియ్యానికి జీఐ ట్యాగ్ లభించింది.
కృష్ణ బియ్యం ప్రత్యేకమైన ఛాయగల దేశవాళీ వరి రకం. ఇతర రకాలతో పోల్చినపుడు దీనిలో అత్యధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బ్రౌన్ రైస్ కన్నా ఎక్కువ ప్రొటీన్ కంటెంట్ కృష్ణ బియ్యంలో ఉంటుంది. కృష్ణ బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, ఊబకాయం మొదలైన వ్యాధులు నయం కావడంలో కృష్ణ బియ్యం ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు రుజువైంది. కొన్ని రకాల కణుతులపై యాంటీ ఇన్ప్లమేటరీ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు వెల్లడైంది. యాంథోసయనిన్ అత్యధికంగాగల ధాన్యాల్లో కృష్ణ బియ్యం ఒకటి. కృష్ణ బియ్యంలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరొటిన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
నల్లని బియ్యం కంటే గొప్ప ఆరోగ్య సంపద ఇంకేదీ లేదు. అసోంలోని గోల్పరా రాష్ట్రంలో రైతులు ఈ నల్ల బియ్యం సాగు మొదలుపెట్టి అధిక దిగుబడి సాధించారు. ఈ నల్ల బియ్యపు వరిసాగుకు చీడపీడల బాధ ఉండదు. కేవలం వందరోజుల్లో పంట దిగుబడి చేతికి వస్తుంది. అమెరికా వ్యవసాయ విభాగం(యూఎస్డీఏ) ప్రకటించిన వివరాల ప్రకారం 100 గ్రాముల కృష్ణ బియ్యంలో క్రింది పోషకాలు ఉంటాయి :
ప్రొటీన్లు – 8.8 నుంచి 12.5 గ్రాములు
లిపిడ్స్ – 3.33 గ్రాములు
ఐరన్ – 2.4 మిల్లీ గ్రాములు
అమిలోజ్ – 8.27 శాతం
కాల్షియం – 24.06 మిల్లీ గ్రాములు
మెగ్నీసియం – 58.46 మిల్లీ గ్రాములు
యాంథోసయనిన్స్ – 69 నుంచి 74 మిల్లీ గ్రాములు అనేక తీవ్ర వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి కృష్ణ బియ్యం ఉపయోగపడతాయని రుజువైంది.
ఈ బియ్యంలో ఉండే ఆంధోనియాసిన్స్ మహిళలకు అధికంగా ఉండే క్యాన్సర్ నిరోధకానికి తోడ్పడతాయని క్యాన్సర్ వైద్య నిపుణులు చెబుతారు.
బ్లాక్ రైస్లో రెండుమూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది ఒబెసిటీ ని అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఇన్సూలెన్స్ లెవెల్స్ను ఈ బియ్యం తగ్గించడం వల్ల డయాబెటీస్ సమస్య కూడా తగ్గినట్లే. బ్లాక్ రైస్లో అంధోనియానిన్స్ ఉంటాయి. ఇవి, కంటి వ్యాధులను నయంచేస్తాయి.
ఈ బియ్యం గంజిని తలకు పట్టిస్తే వెంట్రుకలు బలంగా అందంగా ఉంటాయి. గంజిని ముఖానికి మాస్క్గా రోజు వేసుకుంటే మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి. కడుపు మంట, బ్లడ్ సుగర్ లెవెల్స్ను తగ్గిస్తుందని, మలబద్ధకాన్ని, అతిసారను నిరోధించేందుకు ఉపయోగపడుతుందని రుజువైంది.
అదేవిధంగా మెదడు, కాలేయం పనితీరు మెరుగుపడేందుకు దోహదపడుతుందని, బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుందని రుజువైంది.