ప్రాచీన భారతీయులకు అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయువును అందించిన అమృత ఔషధం గుంటగలగర. ఈ గుంటగలగరాకు హెర్బ్ను ఫాల్స్ డైసీ అని కూడా అంటారు. సంస్కృతంలో దీన్ని భృంగరాజ అంటారు. ఈ ఔషధ మూలిక పొద్దుతిరుగుడు కుటుంబానికి చెందినది. ఇది భారతదేశం, థాయిలాండ్ మరియు బ్రెజిల్ వంటి తేమ ప్రాంతాలలో పెరుగుతుంది. నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలగర. ఈ మొక్కలో రెండు రకాల జాతులు ఉన్నాయి. ఒక మొక్క పసుపు పువ్వులను ఇస్తుంది, మరొకటి తెల్లని పువ్వులను కలిగి ఉంటుంది.
రెండు రకాల పువ్వులు నూనెను తయారు చేడానికి ఉపయోగిస్తారు, కాని ఎక్కువగా ఉపయోగపడే రకం తెలుపు పుష్పించే భింగ్రాజ్ మొక్క. ఆయుర్వేద వైద్య విధానంలో, గుంటగలగరాకు యుగాలుగా ఉపయోగించబడుతోంది. దీని ఆకులు కాలేయ ప్రక్షాళనగా మరియు హెయిర్ టానిక్గా పనిచేస్తాయి. జుట్టు రాలడం, చుండ్రు, అకాల తెల్లజుట్టు వంటి జుట్టు సమస్యలపై ఇది అద్భుతంగా పనిచేస్తుంది మరియు జుట్టును బలోపేతం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ఇది ప్రత్యేకమైన వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను, పునరుజ్జీవనాన్ని కలిగి ఉన్న ‘రసయన సమ్మేళనం’.
గుంటగలగర ఆకులను నీటితో శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. రెండు చుక్కల రసాన్ని ఒక టీ స్పూన్ (5 మి.లీ) తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే దగ్గు ఉపశమిస్తుంది. గొంతులో గరగర తగ్గిపోతుంది. ఇది కారము, చేదు రుచులతో, ఉష్ణస్వభావంతో రసాయనసిద్ధిని కలిగి ఉండటంవల్ల అన్నిరకాల కఫ, వాత రోగాలను నివారిస్తుంది. గుంటగలగర ఆకులను కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇదే రసాన్ని బట్టలో వడగట్టి ముక్కులో చుక్కలుగా వేసుకొని పీలుస్తూ ఉండాలి. దీనివల్ల దీర్ఘకాలికమైన తలనొప్పి, తలబరువు, మెదడు బలహీనత, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం వంటి సమస్యలు నివారించబడతాయి.
ఇది మందగించిన కంటిచూపును పెంచడమే కాక పూర్తిగా కోల్పోయిన దృష్టిని కూడా తిరిగి అందిస్తుంది. ఇది నాశికలో శ్వాసకు అడ్డుపడే చెడు కఫాన్ని, నాశికలో పెరిగే కొయ్య కండరాలను కరిగిస్తుంది. గుంటగలగర ఆకుల రసం, నువ్వులనూనె సమంగా కలిపి పాత్రలో పోయాలి. చిన్న మంటపైన రసమంతా ఇగిరిపోయి, నూనె మిగిలే వరకూ మరిగించాలి. ఆ తర్వాత దించేసి, వడపోయాలి. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ రెండుపూటలా ఈ తైలాన్ని రెండు ముక్కులలో ఐదు చుక్కల మోతాదుగా వేసి, పీలుస్తుంటే నాశికా వ్యాధులు తగ్గడమేగాక దృష్టి, జుట్టు పెరుగుతాయి.
నోరు పొక్కి, కురుపులు ఏర్పడినప్పుడు పులుపు, కారం, ఉప్పు తినటం కష్టమవుతుంది. నాలుగు గుంట గలగర ఆకులను శుభ్రంగా కడిగి నోటిలో ఉంచుకొని చప్పరిస్తే నోటిలో కురుపులు త్వరగా మానిపోతాయి. లేదా గుంటగలగర ఆకులకు తగినంత నీరు కలిపి, నూరి బట్టలో పిండి ఆ రసాన్ని నోటిలో పోసుకొని ఐదు నుండి పదినిమిషాల పాటు పుక్కిలిస్తే నోటి పూత, నాలుకపూత, నాలుకపై పగుళ్ళు, నోటిలో పుండ్లు మొదలైన సమస్యలు తొలగిపోతాయి.
ఇది శరీర రక్షణకు మూలమైన కాలేయం, ప్లీహం వంటి అవయవాలకు ప్రాణం పోసి రక్తాన్ని శుద్ధి చేసి, వృద్ధి చేస్తుంది. ఆకులు, కొమ్మలు కడిగి, దంచి వడపోసిన రసం రోజూ రెండుపూటలా భోజనానికి గంట ముందుగా పావుకప్పు చొప్పున తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కాలేయ వాపు, ప్లీహ వాపు తగ్గి పోతాయి. వయసును బట్టి ఐదు నుండి పది గ్రాములు ఆకుల్ని తీసుకొని, కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరి అరకప్పు నీటిలో కలపాలి. దీన్ని వడబోసి వచ్చిన రసాన్ని ఉదయం, సాయంత్రం రెండుపూటలా భోజనానికి గంటముందు తాగితే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, పేగులలో అలజడి, మలబద్ధకం తగ్గుతాయి.
మార్కెట్లో చాలా తల నూనెలు గుంటగలగర ఆకులతో తయారు చేస్తున్నారు. వెండ్రుకలు రాలిపోకుండా కాపాడే గుణం దీనిలో ఉండటమే అందుకు కారణం. గుంట గలగర మొక్కను వేరుతో సహా మెత్తగా దంచి ముద్ద చేయాలి. దానికి నాలుగు రెట్లు నువ్వులనూనె లేక కొబ్బరినూనె కలిపి సన్నటి సెగపై మరిగించాలి. ఆ మిశ్రమంలోని తేమ ఇగిరిపోయాక నూనెను వడపోయాలి. ఈ గుంటగలగర నూనెను వరుసగా తలకు వాడితే చిన్న వయస్సులో నెరిసిన జుట్టు నల్లబడుతుంది. వెండ్రుకలు రాలిపోవడం ఆగి, కళ్లకు బలం కలుగుతుంది.
తలపైన అక్కడక్కడ ఒక్కమారుగా వెండ్రుకలు రాలిపోయి మచ్చలు మచ్చలుగా అగుపించే దానిని సామాన్యంగా పేనుకొరుకుడు అంటారు. గుంట గలగర మొక్కను వేరుతో సహా సేకరించి మెత్తటి ముద్ద అయ్యేట్లు నూరి పేనుకొరుకుడు గల ప్రదేశాల్లో పూయాలి. ఈ విధంగా ఒక వారం రోజులు చేస్తే వెండ్రుకలు రాలటం ఆగి పోయి కొత్త వెండ్రుకలు వస్తాయి. చిన్నచిన్న పురుగులు కరిచి అక్కడ దద్దు, వాపు, దురద రావచ్చు. గుంట గలగర ఆకు రసాన్ని కరిచిన చోట పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఆకులను నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను గజ్జి, తామర, దద్దుర్లు, దురదలు, పుండ్లు, కురుపులు, గాయాలు తదితర చర్మ సమస్యలకు పై పూతగా వేయాలి. గంట తరువాత స్నానం చేస్తే క్రమంగా ఇవి సమసిపోతాయి. లేదా గుంటగలగర వేళ్లు, వేళ్ళ పొడి, ఇంట్లో కొట్టుకున్న పసుపుకొమ్ముల పొడి సమ పాళ్లల్లో కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండుపూటలా అరచెంచా మోతాదులో తీసుకుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి.
ఎన్నో వ్యాధులను అతి సులువుగా నివారించ గల ఔషధశక్తి ఈ మొక్కల్లో ఉండటంవల్ల గుంట గలగరను పచ్చడి, పప్పు, వేపుడు, తాలింపుకూర మొదలైన వెరైటీలు తయారుచేసుకొని తింటారు. ఆకులను కొంచెం నీటితో కలిపి, దంచాలి. అలా వచ్చిన రసాన్ని వడపోయాలి. దీన్ని పావుకప్పు తీసుకొని అందులో మూడు చిటికెలు ఉప్పు, దోరగా వేయించిన మిరియాల పొడి, రెండు చెంచాల నిమ్మరసం కలిపి రెండుపూటలా భోజనానికి గంట ముందు తాగితే రెండు, మూడు వారాలలో ఆకలి బాగా పెరుగుతుంది.