తెలంగాణ తొలి సినిమాహీరో పైడి జైరాజ్ (28.9.1909)-(11.8.1991)
మూకీయుగం ప్రారంభదశలోనే సినీరంగ ప్రవేశం చేసి,సుప్రసిద్ధ హీరోయిన్ ల సరసన నటించి,దాదాసాహెబ్ ఫాల్కే అవర్డ్ అందుకున్న తొలి తెలుగువాడు పైడి జైరాజ్.సరోజినీ నాయుడు భర్త గోవిందరాజు నాయుడుకు మేనల్లుడైన జైరాజ్ కరీం నగర్ లోని సంపన్నుల ఇంట్లో జన్మించాడు.రుషీవ్యాలీలో విద్య నభ్యసించి,నిజం కాలేజీ విధ్యార్తిగా వున్నప్పుడు షేక్స్పియర్ నాటకాల్లో నటించాడు.నటనపై ఆసక్తిని పెంచుకొని 19వ యేట (1928) బొంబాయి చేరాడు.నాగేంద్ర మజుందార్ నిర్మించిన మూకీచిత్రం జగ్మతి జవానీ (1929) లో వెండితెర ప్రవేశం చేసి,సంవత్సరం తర్వాత రసీలీ రాశీ చిత్రంలో హీరో అయినాడు.శరీరదారుడ్యంతో ప్రేక్షకులను ఆకర్షించిన జైరాజ్ వరుసగా పదకొండు మూకీల్లో నటించాడు.
1931లో ఆలం ఆరా తో టాకీయుగం ప్రారంభం అయింది.అప్పుడు జైరాజ్ హిందీ,ఆంగ్ల భాషల్లో రూపొందిన షికారీ టాకీ సినిమాలో నటించాడు.నాటి హీరోలతో పోటీపడి దేవికారాణి,మీనాకుమారి,నర్గిస్,సురయ్యా,లీలాచిట్నిస్,నూర్జహాన్,నిమ్మి,గీతాబాలి,నిగార్ సుల్తానా,దుర్గాఖోటే,నిరూపారాయ్ లసరసన కథానాయక పాత్రలతో రాణించాడు.దేవికారాణి పక్కన నటించిన బాబి (1938) ఘనవిజయం పొందడంతో అతని డిమాండ్ పెరిగింది.నిండైన విగ్రహం,వాచికం కలిగిన జైరాజ్ షాజహాన్,వీర్ దుర్గాదాస్,పృథివీరాజ్ చౌహాన్,రాణాప్రతాప్,టిప్పుసుల్తాన్ మొదలైన చారిత్రిక పాత్రల్లోనేకాక -స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్ (షహీదే ఆజం),చంద్రశేఖరఆజాద్(1962) పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.వీటితోపాటు మరాఠీ,గుజరాతీ సినిమాల్లోనూ నటించిన జైరాజ్ ఇండో-రష్యన్ చిత్రం పరదేసి, ఎం.జి.ఎం.మాయా,ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ తిసిన నైన్ అవర్స్ టు రామా వంటి అంతర్జాతీయ చిత్రాల్లో కూడా నటించాడు.అయిదు చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
పైడి జైరాజ్ నటించిన కొన్ని చిత్రాలు చూడటానికి అందుబాటులో వున్నాయి.అయినా వీరి సినిమాల్లోకెల్లా హతింతాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అరేబియన్ నైట్స్ తరహాలో వచ్చిన మరో ఫాంటసీ కథాగుచ్చమే హతింతాయి కథలు.ఈ పుస్తకం తెలుగులో బాలసాహిత్యం కింద సంక్షిప్త రూపంలో వెలువడింది.ఈ మధ్యనే లక్ష్మణరావు పతంగే రాయగా అద్భుతవీరుడు హతీం పేరిట ఎమెస్కో వారు వెలువరించారు.
సినిమాగా హతీంతాయి మొదటగా 1929లో తర్వాత 1947,పైడి జైరాజ్ హీరోగా 1956లో తర్వాత 1971,జితేంద్ర హీరోగా 1990లో వెలువడింది.హిందీ,ఉర్దూలలో యానిమేషన్ చిత్రంగా కూడా వచ్చింది.పాకిస్తాన్ లో కూడా 1967లో సినిమాగా వచ్చింది.వీటిలో పైడి జైరాజ్ హీరోగా నటించిన హతింతాయి గేవాకలర్ లో వచ్చి అత్యంత ప్రజాదరణ పొందింది.ఈ సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ చేసిన బాబూభాయి మిస్రీ 1970లో జితేంద్రతో తీసిన చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.ఎస్.ఎన్.త్రిపాఠి సంగీతంలో రఫీ పాడిన పర్వర్ దిగారే ఆలం అనే పాటను,హైదరాబాదులో సినిమా చూస్తున్న నిజాం నవాబ్ 11 సార్లు రిపీట్ చేసుకొని చూశారట.అప్పట్లో అదో పెద్ద వింత.