కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుతీరి వున్న కనక దుర్గామాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం వుంది. ఈ చక్రానికి అగస్త్యల వారు తమ తపః తపస్సును ఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్రరూపంలో వుండేదని, ఆదిశంకరులు ఇక్కడికి వచ్చి శ్రీ చక్రంలోని రౌద్రబీజాలు తొలగించిన తరువాత దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తుల కోరికలు నేరవేరుస్తుందని చెబుతారు. కనకదుర్గా క్షేత్రమహత్యాన్ని తెలిపే ఒక కథను తెలుసుకుందాం.
ఇంద్రకీలాద్రి కథ :-
ఈ కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిరనివాసం ఏర్పరచుకొని భక్తులను కాపాడుతుండేది. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలసి వుండడానికి ఒక కథ వుంది. దుర్గామాత ఆలయం వున్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు.
అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ వుండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీపరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గ ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు కలుగి, సింహాన్ని అధిష్టించి మహిషాసురుని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది.
ఆరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోను ధరించే ఎనిమిది ఆయుధాలు, ఈ దేవీమూర్తికి ఎడమభాగంలో శ్రీ చక్రం స్థాపించబడి వుంది. ఆ శ్రీ చక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి వుంది, ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీ చక్రానికి జరుగుతాయి.
ఆ దేవీమూర్తికి గల మకరతోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి వున్నాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, మష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు.