రామాయణం లో శ్రీరాముడు వనవాసంలో ఉన్న సమయంలో అరణ్యంలో కొన్ని ప్రాంతాలలో నివసించగా అవి నేడు పుణ్యక్షేత్రాలుగా వెలిసాయి. అయితే ఈ ఆలయంలో ముఖ్య రెండు విశేషాలు ఉన్నాయి. సీతారామలక్ష్మణులు, ఆంజనేయస్వామి ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో నలుపు రంగు విగ్రహాలు భక్తులకి దర్శనం ఇస్తుంటాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న మరిన్ని విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర, నాసిక్ లో కాలరామ మందిరం ఉంది. ఈ ఆలయంలో సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహాలు నల్లరాతితో తయారుచేయబడినవి అందుకే ఈ ఆలయానికి కాలరామ మందిరం అనే పేరు వచ్చినదని చెబుతారు. ఈ ఆలయ శిఖరాలు రాగి రేగుతో కప్పబడి బంగారు పూతపూయబడి ఉన్నది. ఈ ఆలయం క్రీ.శ. 1794 లో నిర్మించబడినదిగా తెలియుచున్నది.
పురాణానికి వస్తే, వనవాసంలో ఉన్న సీతరామలక్ష్మణులు నాసిక్ లో ఉన్న ఇక్కడ గోదావరి నది తీరాన రెండు సంవత్సరాలు నివసించారని పురాణం. ఈ ప్రదేశాన్ని పంచవటి అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఐదు పెద్ద వృక్షాలు ఉండటంతో ఈ ప్రదేశానికి పంచవటి అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఇక మహారాష్ట్రాని పరిపాలించే రాజు పీష్వారంగారావు కలలో ఒకరోజు శ్రీరాముడు కనిపించి తానూ వనవాస కాలంలో నివసించిన ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించామని చెప్పగా, ఆ రాజు ఇక్కడ కాలరామ మందిరాన్ని నిర్మించారు. పూర్తిగా నల్లరాతితో ఉండే ఈ ఆలయంలో సిమెంట్ వంటివి ఉపయోగించకుండా కేవలం బెల్లం నీరు పోసి వాటిని అతికించారట. ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపుగా 12 సంవత్సరాల సమయం పట్టగా ఆ కాలంలోనే అంటే సుమారు 200 సంవత్సరాల క్రితమే 23 లక్షల ఖర్చు వచ్చినదని చెబుతారు.
ఇక ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే, ఉదయం సూర్య కిరణాలు ఆలయంలో తూర్పు దిక్కున ఉన్న ద్వారం నుండి ఆంజనేయస్వామి ఆలయం నుండి రామమందిరం లో ఉన్న సీతారామలక్ష్మణులపై పడుతుంటాయి. ఇలా ఉదయం సూర్యకిరణాలు సీతారామలక్ష్మణులపై పడే విధంగా చేసిన అప్పటి వాస్తు నిర్మాణం అద్భుతమని చెప్పవచ్చు.
ఈవిధంగా శ్రీరాముడు వనవాస కాలంలో నివసించిన, కాలరాముడిగా నలుపు రంగులో దర్శనం ఇస్తున్న, అద్భుత వాస్తు శిల్పకళ ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ సీతారామలక్ష్మణులను, ఆంజనేయస్వామిని దర్శనం చేసుకుంటారు.