శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రామావతారం. అయితే శ్రీరాముడు స్వయంభువుగా వెలసిన పుణ్యక్షేత్రం భద్రాద్రి. శ్రీరాముడు కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. ఇది ఇలా ఉంటె భద్రాద్రి రాముడు ఒక భక్తుడి కోసం వచ్చి భద్రాచల రాముడి రూపంలోనే వెలిశాడని పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, కృష్ణాపురం అనే గ్రామంలో శ్రీరామచంద్ర ఆలయం ఉంది. ఈ ఆలయం మహిమ గల ఆలయంగా భక్తులచే పూజలను అందుకుంటుంది. శ్రీరాముడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శ్రీరాముడు ఏవిధంగా అయితే దర్శనమిస్తాడో ఈ ఆలయంలో కూడా శ్రీరాముడు అదేవిధంగా దర్శనమివ్వడం విశేషం.
ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, సుమారు 250 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక రామ భక్తుడు ఉండేవాడు. అతడు ప్రతిసంవత్సరం సీతారాముల కళ్యాణం చూడటానికి కాలినడకన భద్రాచలం వెళ్ళేవాడు. అయితే కొన్ని సంవత్సరాలకు అతడికి వృద్యాప్యం వచ్చిన రాముడి మీద ఉన్న భక్తితో నడవలేని స్థితిలో కూడా కళ్యాణం చూడటానికి రాగ, అతడి భక్తిని చూసి మనసు కరిగిన శ్రీరాముడు భక్తుని రూపంలో వచ్చి ఆ వృద్ధుడిని ఇంటివరకు చేర్చాడు. అయితే ఆ భక్తుడు వచ్చే సంవత్సరం నీ కళ్యాణం చూడటం ఎలా అని బాధపడుతూ నిద్రించగా కలలో శ్రీరాముడు కనిపించి, నీ కొరకు నీ తోటలో ఉన్న పుట్టలో భద్రచలంలో ఉన్న రూపంతోనే వెలుస్తాను. నాకు గుడి కట్టించి, భద్రాద్రిలో అభిజిత్ లగ్నములో కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం సూర్యస్తమయం తరువాత కళ్యాణం జరిపించు అదే నాకు ఇష్టమని చెప్పి అంతరార్థం అయ్యాడట.
ఆవిధంగా ఆ భక్తుడు శ్రీరాముడికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించగా, ఇక్కడ స్వయంభువుగా వెలసిన శ్రీరాముడిని దర్శనం చేసుకుంటే మహాభాగ్యం అని తలచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.