జూన్ 21న ఏర్పడనున్న సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం… ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని కీలక మార్పులు సంభవించవచ్చు అని చెప్తున్నారు పండితులు.. గతేడాది అంటే 2019 డిసెంబర్ 26 న వచ్చిన చివరి సూర్యగ్రహణం సమయం నుండి ప్రపంచంలో కరోనా వైరస్ ప్రారంభం అయింది కాబట్టి, ప్రస్తుతం ఏర్పడనున్న ఈ గ్రహణంతో కరోనా బెడద ముగస్తుందని జ్యోతిష్కులు ఆశిస్తున్నారు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతుల ఆధారంగా భూత, భవిష్యత్ వర్తమాన కాలాలను అంచనా వేస్తుంటారు పండితులు. అందులోనూ గ్రహణ సమయంలో నవగ్రహాల ప్రభావం మనుషులపై ఇంకా ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.. ఇక జాతక రీత్యా కూడా ఈ గ్రహణాలు వలన కలిగే శుభ అశుభ ఫలితకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరంలో చంద్రగ్రహణం రెండు సార్లు రాగా.. తోలి అతిపెద్ద సూర్యగ్రహణం జూన్ 21న ఏర్పడనుంది.. ఈ గ్రహణ సమయంలో సూర్యుడు మరింత ప్రకాశవంతంగా వెలగనున్నాడు. మరి ఈ గ్రహణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గురించి మనం ఇప్పుడు తెల్సుకుందాం..
ఈ సూర్యగ్రహణాన్నిప్రపంచ వ్యాప్తంగా అందరూ వీక్షించవచ్చు. అయితే భారత్ లో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ గ్రహణాన్ని చూడవచ్చు. ఇలాంటి గ్రహణం ప్రతి 18 ఏళ్లకోసారి వస్తుంది. సైన్స్ పరిభాషలో చెప్పాలంటే సూర్యగ్రహణం అనేది ఓ ఖగోళ ప్రక్రియ. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం ద్వారా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కొన్నిసార్లు సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. సూర్యుడి వెలుగును చంద్రుడు పూర్తిగా కప్పిఉంచిన కారణంగా భూమిపై చంద్రుడు నీడ మాత్రమే కనిపిస్తుంది. దీన్నే సూర్యగ్రహణం అని అంటాము. ఇలా కేవలం అమవాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది.
సూర్యుడిని చంద్రుడు కొంత భాగం మాత్రమే కప్పి ఉంచితే.. పాక్షిక సూర్యగ్రహణం అని, అదే చంద్రుడు పూర్తిగా సూర్యుడు కప్పి ఉంచితే సంపూర్ణ సూర్యగ్రహణం అని అంటాము… ఇలాంటి గ్రహణ సమయంలో దేశంలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు పాక్షికంగా వీక్షిస్తే.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడొచ్చు. భారతదేశంలో డెహ్రాడూన్, సిర్సా, టెహ్రీ ప్రాంతాల్లో వలయాకార రూపంలో కనపడనున్న ఈ గ్రహణం, డిల్లీ, ఛండీగఢ్, ముంబయి, హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరు పట్టణాల్లో పాక్షికంగా కనపడనుంది.
జూన్ 21న ఉదయం 10.31 గంటలకు ప్రారంభం కానున్న ఈ సూర్యగ్రహణం మధ్యాహ్నం 2.30 గంటలకు ముగుస్తుంది. దీని పూర్తి ప్రబావం మధ్యాహ్నం 12.18 గంటలకు కనిపిస్తుంది… దాదాపు 3 గంటల 33 నిమిషాలకు పూర్తి గ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం యొక్క సూతక కాలం 12 గంటల ముందే ప్రారంభం అవుతుంది.. అంటే జూన్ 20 9 గంటల 25 నిమిషాలకు ప్రారంభమై గ్రహణంతో సూతక కాలం సమాప్తం అవుతుంది.
ఈ సూర్యగ్రహణం కారణంగా గ్రహాలు, నక్షత్రరాశులలో మార్పులు సంభవించనున్నాయి అని అంటున్నారు జ్యోతిష్కులు.. ఈ గ్రహణంతో కరోనా మహమ్మారి ముగింపు పలకనుందని చెప్తున్నారు… ఈసారి సూర్యగ్రహణం ఆదివారం రావడంతో…. వర్షం తగ్గుతుందని… ఫలితంగా గోధుమలు, వరి, ఇతర ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుందని, అదే సమయంలో ఆవు పాలు ఉత్పత్తి కూడా తగ్గుతుందని చెప్తున్నారు… ఇంతే కాక ప్రధాన దేశాలు, దేశాధినేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉండవచ్చని అంటున్నారు.. అయితే ఈ గ్రహణం వల్ల వ్యాపారులకు మంచి జరుగుతుందని చెప్తున్నారు..
ప్రజలు సాధారణంగానే గ్రహణం సమయంలో వివిధ రకాల నమ్మకాలు, ఆచారాలు పాటిస్తుంటారు.. . ముఖ్యంగా గ్రహణం సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని, భోజనం కూడా చేయకూడదు అని నమ్ముతారు. . గ్రహణం సమయంలో విగ్రహాలను తాకకూడదు. అందుకే దేవాలయాలు సైతం మూసివేసి గ్రహణ అనంతరం సంప్రోక్షణ గావిస్తుంటారు.. అందరు గ్రహణం అనంతరం తప్పక స్నానం ఆచరించి సూర్యదేవుని ధ్యానం చేయడం ద్వారా ఈ గ్రహణం ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెప్తున్నారు పండితులు..