ఆనందం, విషాదం… ఇవన్నీ జీవితంలో భాగమే. మనస్సులోని భావోద్వేగాలను అధిగమించలేక పోయినప్పుడు అది కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. ఏదైనా బాధ వస్తే మనలో చాలా మంది వెంటనే కన్నీరు పెడతారు. సాధారణంగా ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. నవ్వు మానసిక ప్రశాంతత కలిగిస్తుంది అంటారు. నిజానికి నవ్వితే ఎంత మంచిదో ఏడిస్తే కూడా ఆరోగ్యానికి అన్నే ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
ఏడుపు వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయని ఆశ్చర్యపడకండి. మనిషికి ఎక్కువ సంతోషం వచ్చినా, బాధ కలిగినా, భయపడ్డా, ఒత్తిడి పెరిగినా ఏడ్చేస్తారు. ఏడవటం వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గి మనసు కుదుట పడుతుంది. ఇలా బాధపడి ఎక్కువ సేపు ఏడిస్తే వెంటనే నిద్ర పడుతుంది, దీని వల్ల మానసిన ప్రశాంతత దొరుకుతుంది.
అలా పడుకొని నిద్ర లేచినప్పుడు బాధ, ఒత్తిడి తగ్గి సాధారణంగా ఉంటారు. ఎక్కువసేపు ఏడవటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్, ఎండోజెనస్ ఒపియడ్స్ విడుదలవుతాయి. ఇవి శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కలిగిస్తాయి. అందుకే చిన్నపిల్లలు ఏడ్చిన తర్వాత వెంటనే నిద్రపోతారు, ఇలా ఎక్కువ సేపు పడుకుని తర్వాత లేచి ఆ ఏడుపు మర్చిపోయి ఆడుకుంటారు, ఇదే దీని వెనుక ఉన్న రీజన్.
ఏడుపు వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే అది డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఏడుపు ప్రతికూల భావోద్వేగాల నుండి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు భావిస్తున్నారు.