మన దేశంలో ముఖ్యంగా చెప్పుకునే దర్గాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి ఈ దర్గాకి భక్తులు తరలి వస్తుంటారు. ఈ దర్గాకి హిందువులు కూడా అధిక సంఖ్యలో రావడం ఒక విశేషం అయితే, ఈ దర్గాలో లడ్డు ప్రసాదం కూడా పెట్టడం మరొక విశేషం. మరి ఈ దర్గా ఎక్కడ ఉంది? ఈ దర్గాలో దాగి ఉన్న విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ లో హజరత్ జహంగీర్పీర్ దర్గా ఉంది. ఈ దర్గా ఎలా వెలసిందనే విషయానికి వస్తే చరిత్ర కారులు చెబుతున్న వివరాల ప్రకారం ఏడు వందల సంవత్సరాల క్రిందట బాగ్దాద్కు చెందిన హజ్రత్ సయ్యద్ షా జహంగీర్ పీర్ బాబా, హజ్రత్ సయ్యద్ షా బుర్హనుద్దీన్ అవులియా బాబా సోదరులు మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి వివరించేందుకు ఢిల్లీకి వచ్చారు. ఆ బాబా సోదరులు ఈ ప్రాంతానికి చేరుకోగా అప్పట్లో ఈ ప్రాంతం అంత కూడా అడవి ప్రాంతం. వారు ఇద్దరు ఈ ప్రాంతంలో ఉన్న ఒక మరిచెట్టు కింద జీవసమాధి అయ్యారు.
ఇది ఇలా ఉంటె, ఒకసారి గొర్రెలను మేపుకుంటూ వచ్చిన కాపరి దారి తప్పిపోతాడు. అప్పుడు ఎంతవెతికిన ఆ గొర్రెల ఆచూకీ దొరకపోవడంతో భాదపడుతూ ఈ మర్రిచెట్టు దగ్గరకి వస్తాడు. అప్పుడు బాబాలు ప్రత్యేక్షమై ఇక్కడికి దగ్గర్లోనే గొర్రెలు ఉన్నాయని వాటి ఆచూకీ చెప్పడంతో వెళ్లి వాటిని తీసుకొని మరిచెట్టు దగ్గరికి రాగానే బాబాలకి బదులు వారి సమాధులు కనిపించాయి. ఇక తనకి వీరే ప్రత్యేక్షమై జాడ తెలిపారని భావించి అప్పటినుండి ఆ సమాదులకి పూజించడం మొదలు పెట్టాడు. ఇలా అప్పటినుండి మొదలై నేడు కులమతాలకు అతీతంగా వారు పూజించబడుతున్నారు.
అయితే కులమతాలకు అతీతంగా ఉండే ఈ దర్గాలో సాయంత్రం వరకే అనుమతి ఉంది. రాత్రివేళలో ఎవరు వెళ్ళడానికి సాహసించరు, అనుమతి కూడా ఇవ్వరు. దానికి కారణం ఏంటంటే, వారు సమాధి అయినప్పుడు ఈ ప్రాంతం అంత కూడా అటవీ ప్రాంతం కావడంతో ఇటు వైపు ఎవరు వచ్చేవారు కాదు, రాత్రుల్లో క్రూర మృగాలు సంచరిస్తుండేవి. ఇక జహింగిర్ పీర్ కు ఆ క్రూర మృగాలు వచ్చి సేవలు చేస్తాయని సందర్శకుల విశ్వాసం. అందుకే చీకటి అవ్వగానే భక్తులు ఎవరు కూడా ఇక్కడ ఉండరు. అయితే ప్రతి రోజు కూడా జహింగిర్ పీర్ సమాధిని ఒక పెద్ద పులి వచ్చి తన తోకతో సమాధిని శుభ్రం చేస్తుందని అందుకే సందర్శకులు సాయంత్రం అవ్వగానే వెళ్ళిపోతారు రాత్రి వేళలలో ఎవరు కూడా ఈ దర్గాలో సంచరించరు.
ఇక్కడ సంక్రాంతి తరువాత ఉర్సు ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ దర్గాకి ప్రతి ఆదివారం, గురువారం అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇక తల నీలాలు సమర్పించే దర్గా కూడా బహుశా ఇదేనని చెప్పవచ్చు. ఇక్కడ చిన్న పిల్లల తలనీలాలు సమర్పిస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆడవారే క్షురకులుగా ఉంటారు.
ఈవిధంగా ఎన్నో విశేషాలు ఉన్న ఈ దర్గాకి కులమత బేధం లేకుండా అన్ని ప్రాంతాల నుండి వస్తు వారి మొక్కులను తీర్చుకుంటారు