సాధారణంగా అందరి ఇళ్ల గోడలపై బల్లి కనిపిస్తూ ఉంటుంది. అది ఇంట్లో వెలుతూరుకి వచ్చే కీటకాలను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుంది. అందువల్ల ఎవరూ కూడా వాటిని ఇంట్లో నుంచి తరిమివేసే ఆలోచన చేయరు. ఇక అవి హాని చేసేవి కూడా కాకపోవడం వలన ఎవరూ వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే బల్లి కూడా శకునం పలుకుతుందనీ, బల్లిపాటుకి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
బల్లికి శబ్ధం చేసే సూక్ష్మ శక్తి ఉంది. అలాంటి బల్లిని తెలియక తొక్కేయడం లేదా, చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. బల్లి శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేయాలి. దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి అని పెద్దవాళ్లు చెబుతుంటారు. బల్లి మీద పడడం పాపం అని పంచాంగాలు తిరగేయడం లేదా పండితులని అడగడం చేస్తూ ఉంటారు. పంచాంగం లో కానీ లేదంటే ఏదైనా పుస్తకం లో కానీ అక్కడ ఏమి వ్రాసి ఉందొ దాన్ని వెంటనే ఆచరిస్తారు.
కొంతమంది కంచి వెళ్లి వస్తే ఏ దోషం ఉండదని నమ్ముతారు. అయితే నిజంగా మన మీద బల్లి పడితే ఏం అవుతుంది..? దీని వలన మనకి ఏదైనా నష్టం కలుగుతుందా…? వంటి విషయాలని తెలుసుకుందాం. కొన్ని బల్లులు విషపూరితమైనవి. దాదాపు 6000 పై చిలుకు బల్లి రకాలలో, యేవో కొన్ని మాత్రమే విషపూరితం అయినవి. అది కూడా కొంత వరకే. పైగా సాధారణంగా మన ఇళ్లల్లో తిరుగుతూ, దీపాల దగ్గర, ఇతర ప్రదేశాలలో సంచరించే పురుగుల్ని తినే బల్లులు, విషపూరితమైనవి కావు.
ఒక్కోసారి శరీరం లో జరిగే మార్పుల వలన వాటి పట్టుని కోల్పోతాయి. అప్పుడు అవి మన మీద పడతాయి. దానికే మనం చేదు జరుగుతుందని అనుకోవడం మంచిది కాదు. ఏది ఏమైనా నమ్మకం మంచిదే కానీ మూఢ నమ్మకమే ప్రమాదం అని తెలుసుకోవాలి.