పురాణం ప్రకారం బ్రహ్మ ఒకసారి నవగ్రహాలకి కుష్టురోగం వస్తుందని శపించాడు. అప్పుడు శాపవిమోచనం కోసం ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ పూజలు చేసిన శాపవిమోచనం పొందారని, అప్పటి నుండి ఇది నవగ్రహ ఆలయంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? బ్రహ్మ ఎందుకు శపించాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లాలో కుంభకోణం నుండి 15 కి.మీ. దూరంలో గల తిరుమంగళం కుడి అను ప్రాంతంలో సూర్యనార్ కోయిల్ గా పిలువబడే సూర్యదేవాలయం ఉంది. దీనిని క్రీ.శ. 1075 – 1120 సంవత్సరం మధ్య కాలంలో కుళోత్తుంగ చోళ చక్రవర్తి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం మూడు అంతస్థులతో కళ్ళు చెదిరే శిల్ప కళా సంపదతో వెలుగొందుతుంది.
ఇక పురాణానికి వస్తే, పూర్వం కలవుడనే రుషి నేటి కుంభకోణం ప్రాంతంలో ఉండేవాడు. ఆయనను భవిష్యత్తును దర్శించగలిగే శక్తి ఉండేది. ఒకసారి అయన త్వరలో తనకు కుష్టురోగం రాబోతుందని గ్రహించి ఆ వ్యాధి నుండి విముక్తి పొందుటకు తన తపశ్శక్తితో నవగ్రహాలను ప్రసన్నం చేసుకున్నాడు. తనకు అనారోగ్యం రాకుండా అనుగ్రహించమని వారిని వేడుకొనగా అందుకు వారు అంగీకరించారు.
ఈ విషయం బ్రహ్మదేవుడికి తెలిసి, ఉగ్రుడై సృష్టి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించి తన రాతనే ధిక్కరించిన నవగ్రహాలకు అదే కుష్టురోగం వస్తుందని శపించాడు. అప్పుడు సూర్యచంద్రాదులు ఆ వ్యాధి బారిన పడ్డారు. అప్పుడు వారు బ్రహ్మదేవుడిని ప్రార్ధించి ప్రాయచ్చిత్తం చెప్పుమనగా ఈ ఆలయంలో వెలసిన ప్రానాథేశ్వరుడిని సేవించుకోమని చెప్పాడట. దాంతో వారు భూలోకానికి వచ్చి ఆ ఆలయ ప్రాంగణంలో వినాయకుడిని ప్రతిష్టించి భక్తితో పూజించి ఆవిధంగా వారికీ కలిగిన శాపంనుంచి శాపవిమోచనం పొందారని చెబుతారు.
ఇక తనపట్ల చూపిన దయకు కృతజ్ఞతగా కళవ మహాముని తురుమంగళక్కుడి ఆలయానికి సమీపంలో నవగ్రహ దేవతామూర్తులు తపమాచరించిన చోట వారికోసం ప్రత్యేకంగా ఒక ఆలయం నిర్మించాడు. అందులో ప్రధాన మూర్తి సూర్యభగవానుడు.
ఈ ఆలయంలో పూజ చాలా నిష్ఠగా ఉంటుంది. పూజానంతరం ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం చెయ్యవలసి ఉంటుంది. ఈ నవగ్రహ దేవాలయాల ప్రదక్షిణను భక్తులు పవిత్రంగా భావిస్తారు.