ఈ 11 దివ్యక్షేత్రాల యాత్ర మూడు రోజుల సమయం పడుతుంది. దీనినే కల్యాణ క్షేత్రాల పర్యటన అని అంటారు. అంటే పెళ్లి కానీ అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగా పెళ్లి కావాలన్నా, పెళ్ళికి అడ్డొచ్చే విగ్నాలు తొలగిపోవాలన్న ఈ క్షేత్రాలని దర్శిస్తే అన్ని తొలగిపోయి శుభం కలుగుతుందని నమ్మకం. మరి ఈ క్షేత్రాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి? అక్కడ కొలువై ఉన్న స్వామివారు, అమ్మవారు ఎవరనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రంలో త్వరగా పెళ్లయ్యేలా దీవించే కొన్ని దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలన్నిటిని కలిపి కల్యాణ క్షేత్రాల పర్యటన అని అంటారు. ఈ పర్యటన కోసం తమిళనాడు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రేత్యేకంగా ఒక ప్యాకేజి కూడా ఏర్పాటు చేసింది. ఇక మూడు రోజుల సమయం పట్టే ఆ 11 క్షేత్రాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముదిచూర్:
చెన్నై లో ఉండే ఈ ఆలయం దర్శనంతో ఈ యాత్ర అనేది మొదలువుతుంది. ఈ ఆలయంలో విద్యంబిగై అమ్మవారు కొలువై ఉన్నారు.
తిరువిడనత్తై:
ఈ ఆలయం మహాబలిపురం దగ్గరలో ఉంది. ఇక్కడ శ్రీలక్ష్మి వరాహస్వామి ఆలయం ఉంది. అయితే తేత్రాయుగంలో కలవుడు అనే మహర్షికి జన్మించిన 360 మంది కుమార్తెలను శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నట్లు ఇక్కడి స్థల పురాణం చెబుతుంది.
తిరుమణంజేరి:
ఈ ఆలయంలో శివుడిని కల్యాణ సుందరేశ్వర్ గా కొలుస్తారు. ఇక్కడే శివపార్వతుల వివాహం జరిగిందని చెబుతారు.
ఉప్పళియప్పన్:
ఇది ఒక వైష్ణవ క్షేత్రం. అయితే మార్కండేయ ఋషికి భూదేవి చిన్న బాలికగా లభించింది. ఆమె కోకిలంబాల్ పేరుతో పెరిగి శ్రీ మహావిష్ణువుని చేసుకుందని పురాణం.
నాచ్చియార్ ఆలయం:
ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు నరైయూరు నంబిగా, అమ్మవారు నాచ్చియార్ గా కొలుస్తారు. అయితే 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు.
తిరుకరుకావుర్:
ఈ శివాలయంలోని శివలింగం ఒక పుట్టమన్నుతో తయారైంది. అందుకే ఆ మన్ను ఎక్కడ కరుగుతుందో అనే భయంతో ఇక్కడ స్వామికి ఎలాంటి అభిషేకాలు ఉండవు.
తిరుచ్చేరై:
ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సామెత సారనాధుడిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ అమ్మవారికి సారనాయికి అనే పేరు. అయితే కావేరి నదీదేవి శ్రీహరిని వివాహం చేసుకుంది ఇక్కడే అని పురాణం.
మధురై:
ఈ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గొప్ప దివ్యక్షేత్రం. ఈ ప్రాంతం లోనే పాండ్యరాజు తన కుమార్తె మీనాక్షి దేవి చొక్కనాథుడైన పరమేశ్వరునకు ఇచ్చి వివాహం చేసాడని పురాణం. ఇక అనాదినుండి మధుర మీనాక్షి అమ్మవారిని పెళ్లికాని అమ్మాయిలు దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.
తురునల్లూరు:
ఇక్కడ శివుడు పంచావర్ణేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ఈ స్వామిని కల్యాణ సుందరేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు. ఇంకా శివపార్వతుల వివాహం అగస్త్యుడు ఈ ప్రాంతం నుండే చూశాడని పురాణం.
తిరువేడగం:
ఈ ఆలయం వేగై నది తీరాన ఉంది. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని ఏడగానాథర్ అని పిలుస్తారు.
తిరువిళిమిలై:
ఇది ఒక గొప్ప శైవక్షేత్రం. శివుడు కాత్యాయనీ దేవిని వివాహం చేసుకున్న ప్రదేశం ఇదేనని పురాణం. ఇక్కడ స్వామివారిని విలీనాథుడు అని పిలుస్తారు.
ఇలా ఈ 11 కల్యాణ క్షేత్రాలను దర్శిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోయి త్వరగా వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.