శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. ఒక్కో అవతారానికి ఒక్కో విశేషం ఉండగా వేదాలని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడనీ పురాణం. మరి మత్స్య అవతారంలో వెలసిన స్వామివారి అరుదైన ఈ ఆలయం ఎక్కడ ఉంది? మత్య్సవతారం గురించి మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో కొట్టగట్టు అనే గ్రామంలో ఒక కొండపైన మత్స్యగిరింద్రస్వామి వారి ఆలయం ఉంది. అతి పురాతన ఆలయమని చెప్పబడే ఈ ఆలయాన్ని కాకతీయ రాజులూ కట్టించారని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం దగ్గరలోనే ఒక కోనేరు ఉంది. ఇందులో స్నానమాచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక ఏ సమయంలో ఇంకిపోని ఈ కోనేరు లోని నీటిని రైతులు తీసుకువెళ్లి వారి పంట పొలాల్లో చల్లుకుంటారు. ఇలా చేయడం వలన పంటలు బాగా పండి అధిక దిగుబడి వస్తుందనేది వారి నమ్మకం.
ఇక మత్స్యావతార విషయానికి వస్తే, బ్రహ్మ దేవుడు లోకకళ్యాణ్నర్థమై సప్త సముద్రాలూ విహరిస్తున్న సమయంలో ఆయన కునుకు తీయడంతో వేదాలు సముద్రంలో జారిపడగా వాటిని హయగ్రీవుడు అనే రాక్షసుడు అపహరించి సముద్ర గర్భంలో దాక్కుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణవుని ప్రార్ధించి ఆ రాక్షసుడి నుండి వేదాలను రక్షించమని చెప్పగా బ్రహ్మదేవుని కోరిక మేరకు ఆ రాక్షసుడిని సంహరించే బాధ్యతలను శ్రీమహావిష్ణువు తీసుకుంటాడు.
అయితే శ్రీమహావిష్ణువు యొక్క భక్తుడైన సత్య వ్రతుడనే రాజు ఒకరోజు నదిలో తర్పణం వదులుతుండగా అతడి చేతికి ఒక చిన్న చేపపిల్ల తగులుతుంది. ఆ చేపపిల్ల తనని కాపాడమంటూ ఆ రాజుని అడుగగా ఆ రాజు ఆ చేపపిల్లని ఇంటికి తీసుకువెళ్లి కమండలంలో వదులుతాడు. ఆ చేప పిల్ల రోజు రోజు కి ఆకారం పెరిగుతుండంతో అది మాములు చేప కాదని తాను ప్రార్దించే విష్ణువే అని గ్రహించి స్వామికి నమస్కరించగా అప్పుడు శ్రీమహావిష్ణువు ప్రళయం ఆసన్నమైనది వెళ్లి ఒక నౌకాని సిద్ధంచేసుకుని ఆ నౌక లో కొన్ని ధాన్యం విత్తలనాలకు, సప్తఋషులకు, కొన్ని జీవరాశులకు స్థానం కల్పించామని చెప్పి, ప్రళయం సమయంలో నౌకాని నేను రక్షిస్తానని చెబుతాడు. ఇక ఆ సమయంలోనే సముద్రగర్భంలో దాక్కున్నా ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు.
ఆ తరువాత ఆ అంశంతోనే శ్రీమహావిష్ణవు ఈ గ్రామంలో వెలిశాడని అప్పటినుండి భక్తుల పూజలని అందుకుంటూ వారు కోరిన కోరికలను నెరవేరుస్తున్నాడని పురాణం. శ్రీమహావిష్ణువు అవతారాలలో అత్యంత విశిష్టమైన అవతారంగా చెప్పబడే మత్స్యావతారం లో వెలసిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవాలు మొదలై పదిరోజుల పాటు చాలా ఘనంగా నిర్వహిస్తారు.