పూర్వం ఒకానొక సమయంలో లక్ష్మి మానస సరోవరంలో జలకమాడుతూండగా, పార్వతి విష్ణువు వేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవమోహనంగా కనిపించిన నారాయణుని లక్ష్మి చూసింది. నారాయణుడి వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి అద్భుత సౌందర్యం అత్యంత మనోహరంగా కనిపించింది. ఇద్దరూ ఒకసారి సాభిప్రాయoగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణకమలం ఉద్భవించింది.
అందులో ధగధగ మెరిసిపోతున్న పసిపాప ఉన్నది. లక్ష్మి, నారాయణుని దగ్గిరచేరి ఆప్యా యoగా కౌగలించుకోబోయింది. పార్వతి పగలబడి నవ్వుతూ, నేను నారాయణుడిని కాను, లక్ష్మీ! అని ఆ క్షణమే నిజరూపంతో కనిపించింది. లక్ష్మి, అన్నకు తగ్గ చెల్లెలివే, నారాయణి అనిపించుకున్నావులే” అన్నది చిన్నగా నవ్వుతూ పార్వతి, అప్పుడు విష్ణువు మోహినీ రూపంతో శివుణ్ణి మాయబుచ్చినదానికి ఇది చెల్లువేసుకో”అన్నది. స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు.
అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి, తల్లులారా మీ ఇద్దరి అంశలతో అవత రించిన ఈ బిడ్డ పార్వతి పరంగా జయ, లక్ష్మి పరంగా శ్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది. ఆమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు అని చెప్పి, పసిదానితో ఉన్న స్వర్ణకమలాన్ని తీసుకువెళ్ళి కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు.
వాయుదేవుడలాగే జయశ్రీని కావేరినదికి చేర్చాడు. దక్షణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను, వరప్రసాదంగా లభించిన పుత్రికగా భావించి, పరమానందంతో తీసుకువెళ్ళి, నామకరణ మహోత్సవం జరిపించుతూండగా, ఆకాశవాణి, ‘‘జయశ్రీ అని పిలవండి” అని పలికింది.