హిందువులు తరచుగా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు.
దేవాలయాలు సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మలని వేరే చెప్పనవసరం లేదు.
అయితే మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా అక్కడ కోనేరు ఉండటాన్ని గమనిస్తాం.
దాదాపుగా పాత దేవాలయాలలో తప్పనిసరిగా కోనేరు ఉంటుంది. ఈ మధ్య కాలంలో కట్టిన దేవాలయాలలో కోనేరు కనపడటం లేదు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఎక్కువగా నదులు ప్రవహించే తీరాల్లో నిర్మించబడ్డాయి.
కోనేరు,దేవాలయానికి ఏమైనా సంబంధం ఉందా. అని ఆలోచిస్తే దానికి కూడా ఒక కారణం కనపడుతుంది.
ఇప్పడు ఆ కారణం గురించి తెలుసుకుందాం.
నీటిని ప్రాణానికి, జీవానికి ప్రతీకగా చెబుతారు. దేవాలయాలు ప్రశాంతతకు చిహ్నంగా చెబుతారు. దేవాలయాలలో చేసే చాలా అంటే ఇంచుమించు ప్రతి కార్యక్రమానికి నీరు అవసరం అవుతుంది.
దేవలయములో జరిగే మంత్రోచ్చారణలు, పుణ్యకార్యాల శక్తిని నీరు నిక్షిప్తము చేసుకుంటుంది. అలాగే సంధ్యావందనాలకు, పితృకార్యాలకు, అర్ఘ్య పానాదులకు, పుణ్య స్నానాదులకు కోనేటిలోని నీటిని ఉపయోగించడం జరుగుతుంది.
ఇదివరకు చాలా మంది భక్తులు, యాచకులు, దేవాలయ పరిసరాలలో నివసించే పశు పక్ష్యాదుల నీటి అవసరాలకు దేవాలయాల్లో ఉండే కోనేరు నీటి అవసరాలను తీర్చేవి.
కొన్ని దేవాలయాల్లో ఉన్న కోనేరుకి ప్రసాదం సమర్పించే ఆచారం కూడా ఉంది. దీని ఉద్దేశం ఏమిటంటే ఆ కోనేటి నీరులో ఉండే జీవులకు ఆహారాన్ని అందించటం. ఏది ఏమైనా మన పెద్దవారు పెట్టిన ఆచార వ్యవహారాల్లో ఏదో ఒక పరమార్ధం దాగి ఉంటుంది. అర్ధం చేసుకోవాలె గాని ఎంతో గొప్ప సంస్కృతి మనది.