ఈ ఆలయాన్ని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతుంది. ఇక్కడి విశేషం ఏంటంటే సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో సూర్యకిరణాలు ఆలయంలోని స్వామి వారి పాదాలకి తాకుతాయి. ఈ అరుదైన ఘట్టాన్ని చూసి ఆ రోజుల్లో ఆ దేవాలయాన్ని సందర్శిస్తే సర్వ రోగాలు తొలగిపోతాయని ప్రతీతి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఏ తేదీల్లో ఈ అరుదైన ఘట్టాన్ని భక్తులు వీక్షిస్తారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకుళం జిల్లాకి రెండు కిలోమీటర్ల దూరంలో అరసవిల్లి అనే గ్రామం లో అతి పురాతనమైన శ్రీ సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం ఉంది. ఈ ఆలయంలో ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారు కొలువై ఉన్నారు. ఒకప్పుడు ఈ గ్రామాన్ని హర్షవల్లి అని పిలిచేవారు కాల క్రమేణా అది అరసవిల్లిగా మారిందని చెబుతుంటారు.
ఇక్కడ లభించిన శాసనాల ప్రకారం ఈ సూర్యదేవాలయాన్ని గంగ రాజులూ నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ దేవాలయం పక్కనే ఉన్న సూర్యగుండాన్ని 11 శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక పురాణ విషయానికి వస్తే, శ్రీ మహావిష్ణువు అవతారమైన బలరాముడు ద్వాపర యుగంలో జీవులను ఉద్దరించేందుకు తన నాగేటి చాలుతో నాగావళి నదిని ఆవిర్భవింపచేసి ఆ తీరాన ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో స్వామివారిని ప్రతిష్టించాడు. ఆ వింతను తిలకించడానికి దేవతలు స్వర్గం నుండి దిగివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఇంద్రుడు ఒక్కడు సమయానికే రాలేకపోయాడు. అయితే రాత్రి సమయంలో స్వామి దర్శనం కోసం రాగా నందీశ్వరుడు అడ్డుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు కోపానికి గురై వజ్రాయుధం ఎత్తగా, నందీశ్వరుడు తన కొమ్ములతో ఇంద్రుడిని విసిరిపారేశాడు. ఆ సమయంలో సూర్యభగవానుడు ప్రత్యేక్షమై నా విగ్రహం ఇక్కడ ప్రతిష్టించి ఆరాదించమని మాయమవుతాడు. అప్పుడు ఇంద్రుడు అయన చెప్పినట్లే అరసివిల్లిలో శ్రీ సూర్యభగవానుడిని ప్రతిష్టించి, ఆరాధించి, ఇంద్రుడు ఆరోగ్యవంతుడై తిరిగి తన లోకానికి చేరుకున్నాడని ప్రతీతి. అందుకే నవగ్రహాధిపతి ఆయన ఈ స్వామివారిని దర్శిస్తే సర్వగ్రహరిష్టాలు తొలగి శాంతి లభిస్తుందని, చర్మవ్యాధి నిరోధికుడని చర్మ వ్యాధులు అన్ని తొలగిపోతాయని పురాణాలూ చెబుతున్నాయి. ఇక విషయంలోకి వెళితే, ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చి 9,10,11 తేదీలలో, అక్టోబర్ 1,2,3 తేదీలలో ఉదయం 6 గంటల నుండి 20 నిమిషాలపాటు ఐదు ద్వారాల నుండి సూర్య కిరణాలు స్వామివారి పాదాలపైనా పడతాయి. ఈ సమయంలో ఆరోగ్యం కోరుకునే వారు, గ్రహబాధలు ఉన్నవారు స్వామిని దర్శిస్తే అన్ని సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం.