తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే ఒకప్పుడు తిరుపతిలోని తిమ్మప్ప అనే ఆలయం విశేషంగా పూజలందుకున్నది. మరి ఈ ఆలయం స్థల పురాణం ఏంటి? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి కి దగ్గరలో ఉన్న తొండవాడ అనే గ్రామంలో తిమ్మప్ప ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని తాళ్ళపాక అన్నమయ్య వంశానికి చెందిన తిరువేంకటనాథుడు ఈ ఆలయాన్ని కట్టించాడు. ఈ ఆలయం సువర్ణముఖి నదీతీరాన ఉంది. ఈ ఆలయం దగ్గరలోనే అగస్త్య మహర్షి ఆశ్రమం ఉన్నది. అయితే 1950 వరకు ఈ ఆలయంలో పూజలు జరిగేవని, టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ ఈ ఆలయం పైన దాడి చేసి గర్భగుడిలోని విగ్రహాన్ని మైసూర్ రాజ్యానికి తీసుకొని వెళ్లాడని, మూలవిరాట్టు లేని కారణంగా ఆలయానికి భక్తుల రాక తగ్గి శిధిలావస్థకు చేరిందని ఆలయ చరిత్ర ద్వారా తెలియుచున్నది.
ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర రూపంతో వేంకటాద్రి మీద వెలిసాడు. ఇక లక్ష్మీదేవి పద్మావతి రూపంతో ఆకాశరాజు దంపతులకి పుత్రికగా జన్మించింది. ఆ తరువాత యుక్త వయసుకి వచ్చిన పద్మావతీదేవి వేంకటేశ్వరుని తప్ప ఎవరిని వివాహం చేసుకోనని తనకు ఆ స్వామితోనే వివాహం జరిపించమని తన తండ్రిని కోరింది. అప్పడు కుమార్తె కోరికను మన్నించిన ఆకాశరాజు శ్రీ వెంకటేశ్వర, పద్మావతిల కళ్యాణం జరిపించారు. ఇలా వివాహం జరిగిన తరువాత తిరుమల కొండకు వెళ్లే సమయంలో వారిని అగస్త్య మహర్షి ఆహ్వానించి కొత్తగా పెళ్ళైన దంపతులను ఆరు మాసాలు ఈ ప్రాంతంలో ఉండవలసిందిగా కోరగా, అగస్త్యుల వారి ఆనతి మేరకు వారు ఇక్కడ నివసించారని పురాణం.
ఇక ఈ ఆలయానికి దగ్గరలోనే అగస్త్వేశ్వరాలయం ఉంది. ఇక ఈ ఆలయానికి అనుకోని సువర్ణముఖి నది, ఆ నదికి అవతలి ఒడ్డున తొండవాడ గ్రామం ఉన్నాయి. అయితే ఈ ఆలయానికి కొద్దీ దూరంలోనే భీమనది, కల్యాణీనది, సువర్ణముఖి నది సంగమం ఉంది. ఈవిధంగా మూడు నదులు కలవటం వల్ల త్రివేణి సంగమ ఫలితం లభించిందని అగస్త్యుడు అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఒక రోజు ఆయన నదీస్నానం చేస్తుండగా ఆయనకి ఒక సహజ లింగం దొరుకగా దానిని ఆ నదీతీరాన ప్రతిష్టించించి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు.