ప్రపంచాన్నీ వణికిస్తున్న కరోనా వైరస్ దేవుళ్లను సైతం వదలిపెట్టలేదు. ఈ మహమ్మారి కారణంగా మార్చ్ 23 నుండి లాక్ డౌన్ లో భాగంగా దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద అన్ని ఆలయాలను దర్శనాలు లేకుండా మూసివేశారు.. ఇప్పటికీ లాక్ డౌన్ ను నాలుగు సార్లు పొడిగించారు.. లాక్ డౌన్ 5.0 లో భాగంగా కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ, ఎక్కడ, ఎప్పుడు, ఎటు నుంచి వైరస్ సోకుతుందోనని ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.
అయితే కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఒక పక్క ముమ్మరంగా కృషి చేస్తున్న ప్రభుత్వం.. అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సడలింపులతో విధించిన లాక్డౌన్ను జూన్ 30 వరకు పొడిగించింది.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ లాక్డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలు, ప్రార్ధనా స్థలాలు తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయం కూడా తెరుచుకోనుంది.. అయితే ఆలయాలకు ప్రార్థనాస్థలాలకు ఇచ్చిన సడలింపుల్లో ఉన్న నిబంధనలేంటి, ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమలలో దర్శనానికి ఉన్న నిబంధనలు ఏంటి తెల్సుకుందాం..
కేంద్రం ఈ ఐదో విడత లాక్డౌన్ నిబంధనల్లో ఆలయాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో, టిటిడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై దేవాదాయ శాఖ ఇప్పటికే పలు మార్గదర్శకాలను రూపొందించి వైద్యారోగ్య శాఖ కు పంపించినట్లు సమాచారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే శ్రీవారి భక్తుల్ని దర్శనాలకు అనుమతించనున్నారు. అయితే అంతరాలయంలోకి ప్రవేశం లేకుండా కేవలం లఘు దర్శనానికే పరిమితం చేస్తారు. ముందులా అన్నీ కంపార్టుమెంట్స్ నిండేలా కాకుండా గంటకు 300 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకోసం తిరుమలకు వచ్చే భక్తులకు కరెంట్ బుకింగ్, ఆన్లైన్ ద్వారా టైమ్ స్లాట్ టిక్కెట్లు జారీ చేయనున్నారు. ఇక తిరుమలకు వచ్చేవారు విధిగా మాస్క్లు, గ్లౌజులు ధరించాల్సి ఉంటుంది..
అలాగే కాటేజీల్లోని గదుల్లో కూడా ఒక గదిలో ఇద్దరు మాత్రమే బస చేసేందుకు అనుమతిచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.. వాటిలోనూ ఒకదాన్ని వదిలి మరొకటి చొప్పున ఉన్నగదుల్లో మొత్తం 50 శాతం గదులను మాత్రమే భక్తులకు కేటాయిస్తారు. కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించే దగ్గర క్షురకులు అన్ని జాగ్రత్తలు తీసుకోనేలా, అలాగే భక్తులు కూడా జాగ్రత్తగా ఉండలని సూచిస్తున్నారు.. . ఇక ఆలయ ప్రాంగణంలోని దుకాణాలు కూడా ఒకదాన్ని విడిచి మరోటి మాత్రమే తెరిచేందుకు అనుమతివ్వాలి. రెగ్యులర్ గ జరిగే అన్నదానం, నిత్యాన్నప్రసాదం ఉండదు. ఆలయాల సమీపంలోని పుష్కరిణి, నదులు, చెరువుల్లో స్నానానికి అనుమతులు లేవు.. బయట ఫుడ్ స్టాల్ల్స్ కు అనుమతులు లేవు..
ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం, దేవాదాయ శాఖ వారు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టిన దర్శనార్ధమై వెళ్తున్న భక్తులు స్వయం శుద్ధి పాటిస్తేనే కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చు..