ఇది ఒక శివాలయం. ఈ ఆలయంలో ఒకేచోట నవగ్రహ కూటమి కొలువై ఉన్నట్లు దేశంలో మరెక్కడా కూడా లేదు. అంతేకాకుండా ఇక్కడ మొత్తం 64 మంది దేవతామూర్తులు మనకి దర్శనం ఇస్తారు. మరి సంపూర్ణ నవగ్రహ దేవతాలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని ఆ నవగ్రహాలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలోని, మెదక్ జిల్లా, తొగుట మండలం, రాంపూర్ గ్రామంలోని శ్రీ గురు మదనానంద శారదాపీఠం ఉంది. ఆ పీఠంలో సంపూర్ణ నవగ్రహ ఆలయం నిర్మించారు. సాధారణంగా శివాలయాలలో ప్రత్యేకంగా ఒక ఆవరణ ఉంటుంది. కానీ, అలాకాకుండా రాష్ట్రంలోనే నవగ్రహాలకు, ఆయా గ్రహాల ఆధిదేవతలు, ప్రత్యర్థి దేవతలూ, దిక్పాలకుల సహితంగా సంపూర్ణ నవగ్రహ ఆలయాన్ని నిర్మించారు.
ఇక్కడ మొత్తం 64 మంది దేవతామూర్తులు కనిపిస్తారు. సూర్యుడి అధిదేవత అగ్నిదేవుడు, ప్రత్యధిదేవత రుద్రుడు, అలాగే బుధుడి అధిదేవత విష్ణుమూర్తి, ప్రత్యధిదేవత నారాయణుడు. ఇలా ప్రతి గ్రహానికి ఆ గ్రహం తాలూకు అధిదేవత, ప్రత్యధిదేవతలను కూడా ఆయా గ్రహాల విగ్రహాల ప్రక్కనే ప్రతిష్టించారు. తమిళనాడులో నవగ్రహాలకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నపటికీ ఇచటివలె సంపూర్ణ నవగ్రహ కూటమి ఒకే చోట కొలువై ఉన్న ఆలయం మాత్రం దేశంలో మరెక్కడా లేదు.
ఐదు ఎకరాల విశాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించి 1999 లో మాఘ బహుళ దశమి రోజున విగ్రహాలను ప్రతిష్టించారు. ఇలా నవగ్రహాలను నిర్మించాలన్న సంకల్పం కర్ణాటక లోని బసవకల్యాణ్ పీఠాధీశ్వరులు మదనానంద స్వామివారి ఆలోచన. అయితే అయన కర్ణాటక నుండి తొగుట గ్రామానికి తరచూ వస్తుండేవారు. ఒకసారి ఈ గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు ఉరి శివారులో నవగ్రహ ఆలయాన్ని నిర్మిస్తే గ్రామస్థులకు మేలు జరుగుతుందని అయన మనసులో తోచింది. అలా తోచిన వెంటనే ఆచరణలో పెట్టి భక్తుల వితరణతో నాలుగేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేసారు.
ఇక ఆలయ విషయానికి వస్తే, సూర్యమండలం వర్తులాకారంలో గుండ్రని పీఠం పైన కొలువై ఉంటారని పురాణాలూ చెబుతున్నాయి. అలాగే ఒక్కో గ్రహం మండలం ఒక్కో ఆకారంలో ఉంటుంది. శాస్రంలో చెప్పిన విధంగా నవగ్రహ పీఠాలన్నీ ఆయా ఆకారాల్లోనే, ఆయుధాలు, వారి వాహనాలతో సహా తీర్చిదిద్దారు. ఒక్కో విగ్రహం ఎత్తు సుమారు రెండున్నర అడుగులతో అధ్బుతంగా, సజీవంగా మలిచారు.
ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఒకటిన్నర అడుగుల ఎత్తుండే స్ఫటికలింగం. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద స్పటికలింగంగా చెప్పబడుతుంది. కోటి సైకత లింగాల్ని చేసి వాటిపై ఈ శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ స్వామివారిని భక్తులు బావని చంద్రమౌళీశ్వరుడిగా కొలుస్తారు. అయితే గ్రహస్థితిలో దోషాలు ఉన్నవారు, కాలసర్పదోషం బాధితులు, సంతాన, వివాహ సమస్యలు ఉన్నవారు ఈ నవగ్రహ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఆలయ వార్షికోత్సవం నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు.