కొందరికి ఏ కాలంలో అయినా సరే పొడి దగ్గు వస్తుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా మంది పొడిదగ్గుతో సతమతం అవుతూ ఉంటారు. మనం తీసుకునే శ్వాస క్రియలకు ఆటంకం ఏర్పడినప్పుడు దగ్గు వస్తుంది. ఇది ఎక్కువగా వాతావరణ మార్పుల వలన, శీతలపానీయాలను ఎక్కువగా తాగడం వలన వస్తుంది. అయితే కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత దేశంలో విస్తరిస్తున్న తరుణంలో చిన్నపాటి దగ్గు వచ్చినా సరే చుట్టుపక్కల వారు భయపడుతున్నారు. ఎందుకంటే అవే కోవిడ్-19 ప్రధాన లక్షణాలు. ఏ దగ్గు ఏ అనారోగ్యాన్ని సూచిస్తుందో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది.
అయితే, మీకు వచ్చే దగ్గు ఎలాంటిదైనా సరే.. దాన్ని భరించడం చాలా కష్టం. ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు మనిషిని కుంగదీస్తుంది. ఒక వేళ మీకు దగ్గు ఎక్కువగా వస్తున్నా, చాతి వద్ద మంట లేదా భారంగా అనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. జలుబు, దగ్గులను ఎట్టి పరిస్థితిలో లైట్ తీసుకోవద్దు. అలాగే కాలం మార్పుల వల్ల దగ్గు వచ్చినా కరోనా అని భయపడకూడదు. సాధారణంగా వచ్చే పొడి దగ్గు తగ్గాలంటే చిట్కాలను పాటిస్తే చాలు దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
->దగ్గు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు రోజూ రెండు పూటల గ్లాసు పాలల్లో కాస్త అల్లం లేదు వెల్లులి వేసి మరిగించండి. ఆ తర్వాత పసుపు వేసి గోరువెచ్చగా తాగితే ఉపశమనం ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది.
->లవంగాలు, దాల్చినచెక్క, అల్లం రసం, మిరియాలు కలిపి వేసి తయారు చేసిన మసాలా టీని తాగడం వల్ల కూడా దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
->పసుపులో కుర్క్యుమిన్ అనే పదార్థం వైరస్,బ్యాక్టీరియా, వాపు వంటి లక్షణాలని తగ్గిస్తుంది. అల్లం, వెల్లుల్లి టాన్సిల్స్ ప్రాంతంలో దిబ్బడను తగ్గించి సహజ నొప్పి నివారుణుల్లా పనిచేస్తాయి.
->గ్లాసు నీటిలో అర టీ స్పూన్ అల్లం తరుముకు, కొద్దిగా టీ పౌడర్, మూడు తులసి ఆకులు వేసి సుమారు పది నిమిషాలు మరిగించాలి. ఈ ద్రవం చల్లారిన తరువాత తాగితే గొంతులో గరగరతో పాటు దగ్గు తగ్గుతుంది.
->పొడి దగ్గు..ఛాతిలో పట్టినట్టు ఉంటే దీని కోసం ముందు మూడు కప్పుల నీళ్లలో రెండు తమలపాకులు, నాలుగు మిరియాల పొడి వేసి కలిపి 15 నిమిషాలు మగరబెట్టి దింపాలి. ఈ మిశ్రమంలో చెంచాడు తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి.
->దగ్గు తీవ్రత ఎక్కువగా ఉంటే రోజూ ఉదయాన్నే రెండు చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి తాగండి. తిప్పతీగ రసం రోగనిరోధకశక్తిని పెంచుతుంది, మూడు దోషాలైన – వాత, పిత్త, కఫాల మధ్య సమన్వయం తెస్తుంది.
->ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించాలి. ఆ తరువాత వచ్చే మిశ్రమాన్ని తాగితే దగ్గు , జలుబు తగ్గుతుంది.
->తేనె, యష్టిమధురం పొడి, దాల్చిన చెక్క పొడి నీటిలో కలిపి ఉదయం సాయంత్రం తీసుకున్నా… దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. తేనెలో ఉండే డెక్స్ట్రో మెథోర్ఫాన్ వాపులని తగ్గిస్తుంది.
->పైనాపిల్ పండ్లలో ఉండే బ్రొమెలెన్ దగ్గును త్వరగా తగ్గిస్తుంది. పైనాపిల్ పండ్లను తినడం ద్వారా దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు.
->లవంగాలు చప్పరిస్తే గొంతులో గరగర తగ్గుతుంది. దాంతో పాటు పాలలో పసుపు వేసుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.
->దగ్గు మరీ ఎక్కువగా ఉంటే మిరియాల కషాయం తాగండి లేదా అర చెంచా నల్ల మిరియాల పొడిని నెయ్యితో కలిపి కడుపు నిండుగా ఉన్నప్పుడు తినండి.
->అర టీ స్పూన్ శొంటి పొడిని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
->పొడి దగ్గుతో బాధపడుతుంటే అర టీ స్పూన్ ఇంగువపొడి , ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం , ఒక టేబుల్ టీ స్పూన్ తేనె లను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల దగ్గును తగ్గించుకోవచ్చు.
->కరక్కాయ కూడా పొడి దగ్గును తగ్గించడంలో దోహద పడుతుంది. కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
->దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడి, పిప్పాలి పొడిని కలిపి తాగినా దగ్గు తగ్గుతుంది. దానిమ్మలో ఉండే విటమిన్ A, C రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
->తమలపాకులను నమలడం వల్ల కూడా పొడి దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు.
ఈ చిట్కాలు పాటించడంతో పాటు 24 గంటలన్నా ఎక్కువగా దగ్గు ఉంటే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహాలు పాటించాలి. మిగితా వారితో భౌతిక దూరాన్ని పాటించాలి. ముఖ్యంగా మాస్క్ ధరించాలి. అనవసరంగా బయటికి వెళ్లకపోవడం మంచిది.