శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ విశేషం ఏంటంటే, అమ్మవారు భక్తుల కోరిక మేరకు కాశి నుండి వచ్చి ఈ ప్రాంతంలో వెలిశారని స్థల పురాణం. మరి అమ్మవారు అక్కడి నుండి ఎందుకు వచ్చారు? భక్తులు అమ్మవారిని ఏమని కోరుకున్నారు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, బనగానపల్లి మండలం, నంద్యాల రహదారి పక్కన, బలగానపల్లి కి 8 కీ.మీ. దూరంలో నందవరం అనే గ్రామం కలదు. ఈ గ్రామములో చౌడేశ్వరి దేవి ఆలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పూరితమైన ఆలయం. బ్రహ్మం గారు
కొంతకాలం నివసించిన బనగానపల్లెకు ఈ క్షేత్రం సుమారు 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని చాలా విశాలంగా పెద్ద ఎత్తులో నిర్మించారు.
ఇక ఆలయ పురాణానికి వస్తే, పూర్వము ఈ నందవరం ప్రాంతాన్ని పాలించే రాజు తనకు ఒక సిద్ధుడు ప్రసాదించిన పాదలేపనంతో ప్రతిరోజు కాశీకి వెళ్లి విశాలాక్షిని పూజించి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు అయన భార్యాసమేతంగా వెళ్లగా అక్కడ పాదాలకు రాసుకున్న లేపనం ఆరిపోవడంతో వాడు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు అక్కడి బ్రాహ్మణులూ తమ తపోశక్తితో ఆ రాజు దంపతులను వారి స్థలానికి పంపించారు.
అక్కడి నుండి వెళ్లబోయే ముందు రాజు, బ్రాహ్మణులూ తనకు చేస్తున్న ఉపకారానికి ప్రతి ఫలాన్ని తప్పకుండ ఏదో ఒకనాడు అందిస్తానని వాగ్దానం చేసాడు. కొంతకాలానికి కాశీలో కరువు రాగ ఆ బ్రాహ్మణులూ నందవరానికి వచ్చి రాజుని సహాయమడుగగా, రాజు తాను వారికీ ఇచ్చిన మాటకు సాక్ష్యం ఏమిటి అంటూ ప్రశ్నిస్తాడు.
అప్పుడు బ్రాహ్మణులూ రాజు ఇచ్చిన మాటకు ఆ కాశి విశాలాక్షే సాక్ష్యమని చెప్పి కాశీకి వెళ్లి విశాలాక్షిని సాక్ష్యం చెప్పడానికి రమ్మనగా, మార్గమద్యములో ఎక్కడ కూడా వెనుతిరిగి చూడరాదని షరతు విధించి వారి వెంబడి బయలుదేరింది విశాలాక్షి. కానీ నందవరం సమీపంలో బ్రాహ్మణులూ వెను తిరిగి చూడడంతో అక్కడే ఆమె చౌడేశ్వరిగా నిలిచిపోయింది. అప్పుడు రాజు విశాలాక్షిదేవిని తన రాజ్యానికి రప్పించడానికే తాను ఈవిధంగా ప్రవర్తించానని చెప్పి, చౌడేశ్వరి దేవికి ఆలయం నిర్మించాడు. ఈ చౌడేశ్వరి అమ్మవారు కోరిందల్లా ఇచ్చే తల్లిగా భక్తులకి నమ్మకాన్ని కలిగించింది. ఇచట నిత్యా పూజలతో పాటు, విశేష పూజలు కూడా నిర్వహిస్తారు. శరన్నవరాత్రుల సందర్బంగా ఇక్కడ పెద్ద జాతర నిర్వహించబడుతుంది. ఆ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శిస్తారు.