పెళ్లి రద్దైన వారు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొనే వారు, పెళ్లి అయినా విడాకులు తీసుకున్నవారు, లేదా తరచూ వివాహ ప్రయత్నాలు విఫలమైనట్లు అనిపించే కన్యలు ఆచరించడానికి పురాణాల్లో ఓ వ్రతం ఉంది. అదే కాత్యాయని వ్రతం. మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు, జాతక చక్రములో కుజదోషము వున్నవారు, రాహుకేతు దోషములు కలవారు, ఆర్థిక స్తోమత లేక వివాహాలు ఆగిపోతున్నవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
మరి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం… ఈ వ్రతాన్ని మంగళవారం రోజున ఆరంభించాలి. మంగళవారం కృత్తిక నక్షత్రమైతే ఇంకా మంచిది. నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి పర్వ దినాలలో కూడా ఈ వ్రతము ఆచరించవచ్చు. దేవినవరాత్రుల సమయంలో కూడా ఈ వ్రతము ఆచరించవచ్చు.
బంగారముతో కానీ, పసుపు కొమ్ములతో కానీ వారి శక్తి మేరకు మంగళ సూత్రములు కలశమునకు అలంకరించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని నైవేద్యముగా సమర్పించాలి. ఏడు తొక్క తీసిన చెరుకు ముక్కలను కూడా నైవేద్యముగా సమర్పించాలి.ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలు, ఏడు చెరుకు ముక్కలు, ఏడు రవికలు వాయనమిచ్చి ఒక్కరికి చీర ఇచ్చి వారిచే అక్షతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకోవాలి. ముందుగా పసుపుతో గణపతిని చేసి గణపతికి పూజ చేయాలి. తరువాత పసుపు రాసిన పీటపై బియ్యం పోసి దానిపై కలశమును వుంచి కలశములో పవిత్రమైన నీటిని సగం వరకు పోయాలి.
అమ్మ వారి విగ్రహము లేదా ప్రతిమగా రూపాయి వుంచాలి. ఇంటిలో తూర్పు వైపున ఈశాన్య దిక్కున శుభ్రం చేసి ముగ్గులు వేసి ఎర్ర కండువ పరిచి దాని మీద బియ్యంపోయాలి. బియ్యం పైన రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ ఉంచి టెంకాయను వుంచి దానిపై ఎర్రని రవిక కిరీటంలా పెట్టి కలశస్థాపన చేయాలి. ఈ వ్రతంలో ఎర్రని పువ్వులు ఎర్రని అక్షతలనే వాడటం శ్రేష్ఠం. వ్రతం అయిన తరువాత వండిన భోజన పదార్దములు నైవేద్యం పెట్టాలి. షోడశోపచార పూజ జరుపుకోవాలి. వ్రత మండపములో పార్వతీపరమేశ్వరుల ఫోటో ఖచ్చితముగా ఉండాలి.
వ్రతం పూర్తీ చేసిన తరువాత వ్రతకథ విని కథాక్షతలను అమ్మవారి మీద వుంచి, ఆ అక్షతలను పెద్దలతో తలపై వేయించుకుని ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇలా ఏడు మంగళ వారాలు భక్తితో వ్రతం జరుపుకోవాలి. మధ్యలో ఏ వారమైన వీలుకాకపోతే ఆ పై వారం వ్రతం జరుపుకోవచ్చు. ఇలా ఏడు వారాలయ్యాక ఏడో మంగళవారము ఉద్యాపన జరుపుకోవాలి. ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటి పోయాలి. అలా కానీ వారు ఉదయం ముత్తైదువుల ఇంటికి వెళ్లి తలస్నానానికి కుంకుడు కాయలు, పసుపు ఇచ్చి రావాలి.
ఈ వ్రతాన్ని సాయంకాల సమయంలో ఆచరించాలి. వ్రతం చేసే రోజున పగలంతా ఉపవాసము ఉండి వ్రతము పూర్తి అయిన తరువాత భోజనము చేయాలి. పగలు నిద్రపోరాదు. చివరి వారములో పుణ్య స్త్రీలకు దక్షిణ తాంబూలాదులతో కనీసం 7 కాత్యాయనీ వ్రత పుస్తకములను సమర్పించాలి. ఆర్ధిక స్తోమత లేని వారు వ్రతం ఆచరించలేని వారు ఏడుగురు వివాహం కాని కన్యలకు ఏడు పుస్తకాలను ఇచ్చినా చాలా మంచిది.